Election Commission : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. అన్ని రాజకీయ పార్టీలు అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయింది. మూడో దశ పోలింగ్ నేడు జరుగుతోంది. ఇంకా నాలుగు దశల పోలింగ్ జరగాల్సి ఉంది. ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు నిమగ్నమైపోయారు. ఈ క్రమంలో ఓటర్లను నమ్మించేందుకు నానారకాల హామీలు గుప్పిస్తున్నారు. దీంతో పాటు ప్రతిపక్ష నాయకుల లోపాలను ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలన్నీ డిజిటల్ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అత్యధిక ప్రాధాన్యత ఈ రకమైన ప్రచారానికే ఇస్తున్నారు రాజకీయ నాయకులు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికల్లో ఫేక్ ప్రచారాలు ఊపందుకున్నాయి. ఎదుటి వారిని కించపరిచేలా ప్రచారాలకు తెరలేపారు కొందరు రాజకీయ నాయకులు. ఇలాంటి ప్రచారాలపై ఎన్నికల సంఘం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఫిర్యాదులను రాజకీయ పార్టీల దృష్టికి తీసుకువచ్చిన మూడు గంటల్లోగా వాటిని తొలగించాలని ఆదేశించింది. బాధ్యులను గుర్తించి హెచ్చరించాలని పేర్కొంది. డీప్ఫేక్ వీడియోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది.
పార్టీలు, ప్రజాప్రతినిధులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తుండటంతో ఈసీ ఈవిధంగా స్పందించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించి కొందరు ప్రముఖ నాయకులు, సెలబ్రిటీల డీప్ఫేక్ వీడియోలను వైరల్ చేస్తున్న నేపథ్యంలో ఈసీ ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అందరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని సూచించింది. ఆర్టీఫిషియల్ టూల్స్ను దుర్వినియోగం చేయొద్దని హెచ్చరించింది. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడాలని హితవు పలికింది.
ఇటీవల కాలంలో అమిత్ షా డీప్ ఫేక్ వీడియో ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో పలు రాష్ట్రాలకు చెందిన వారికి పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. వారిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికూడా ఉన్నారు. ఆయనకు కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాల్సిందిగా కోరారు.