Hung in Telangana : తెలంగాణలో ఎన్నికల సమరం మొదలైనట్లే కనిపిస్తున్నది. ఇక రేపో, మాపో షెడ్యూల్ రాబోతున్నది. ఇప్పటికే అన్ని పార్టీలు క్షేత్రస్థాయిలో అస్ర్తాలు సిద్దం చేసుకున్నాయి. అధికార పార్టీ ఈ వ్యవహారంలో కొంత ముందున్నా, చాప కింద నీరులా కాంగ్రెస్ బలంగా కనిపిస్తు్న్నది. దాదాపు మెజార్టీ నియోజకవర్గాల్లో పార్టీ తన బలాన్ని పెంచుకున్నది. ఇక బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేననే అభిప్రాయం ప్రజల్లోకి నేరుగా వెళ్లింది. దీంతో రాష్ర్టంలో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ మాత్రమే కనిపిస్తున్నది. ఇక బీఆర్ఎస్ వ్యతిరేకులు, ఇన్నాళ్లూ తటస్థులుగా ఉన్నవారు, సంక్షమ పథకాలు అందని వారు, బీఆర్ఎస్ అసమ్మతులు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నది. ఇందులో మూడో స్థానంలో నిలిచే బీజేపీ మాత్రం ఎన్ని సీట్లు సాధిస్తుందనేది ఇప్పుడు అసలు ప్రశ్న.
అయితే ఆ పార్టీ నేత బీఎల్ సంతోష్ మాత్రం తెలంగాణలో హంగ్ రాబోతున్నదని చెబుతున్నారు. ఇక ఆ రెండు పార్టీలకు సరిపడా సీట్లు రావని, దీంతో తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో పలు రాష్ర్టాల్లో బీజేపీ వ్యవహరించిన తీరు కూడా అదే రీతిలో ఉంది. మెజార్టీ సీట్లు తక్కువున్న చోట అధికారాన్ని చేజిక్కించుకోవడానికి బీజేపీ ఏదైనా చేస్తుందని అందరికీ తెలిసిందే. మరోవైపు సౌత్ లో ఒక్క రాష్ర్టం కూడా ఇప్పుడు ఆ పార్టీకి లేదు. దీంతో ఇలాంటి ఆశలు పెట్టుకుంటున్నది. అయితే తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ కొంత కాలంగా సైలెంట్ అయ్యింది. దీనికి కారణం తెలంగాణలో బీఆర్ఎస్ వచ్చినా పర్లేదు కానీ, కాంగ్రెస్ రాకూడదనేది ఆ పార్టీ వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ ఎలాగూ ఎన్డీఏలో చేరేందుకు తహతహలాడుతున్నదని, ఇక కాంగ్రెస్ గెలిస్తే తమకు కూడా కొంత ఇబ్బంది అవుతున్నదని భావిస్తున్నది.
అందుకే స్వయంగా తమ పార్టీనే చంపుకునే చర్యకు దిగింది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో బలంగా కనిపించిన పార్టీ ఇప్పుడు ఒక్కసారిగా బలహీనంగా మారింది. బండి మార్పు తర్వాత అసలు ఆ పార్టీ తెలంగాణలో ఉందా అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సింగిల్ డిజిట్ దాటడం ఇక కష్టమే అనే అభిప్రాయం వినిపిస్తున్నది. ఇలాంటి సందర్భంలో బీఎల్ సంతోష్ తమ ప్రభుత్వమే ఏర్పడబోతున్నదని వ్యాఖ్యలు చేయడం సంచలనమైంది.