BRS Party : లోక్ సభ ఎన్నికల్లో గెలవాలని మూడు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. తమ పవర్ చూపించుకుని ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నాయి. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. దీంతో బీఆర్ఎస్ ఓట్లు తెచ్చుకుని తన ఉనికి చాటుకోవాలని చూస్తోంది. దీని కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది.
లోక్ సభ ఎన్నికల తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి. దీంతో ఆ ఎన్నికల్లో కూడా తన ప్రభావం చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ సానుభూతిపరులను కాపాడుకోవడం కష్టంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో అందరిలో భయం నెలకొంది. పార్టీ ప్రతిష్ట మసకబారింది. అధికారంలో ఉన్నన్ని రోజులు తన మాటే చెల్లుబాటు అయింది. అది కోల్పోగానే ప్రతికూలతలు వెక్కిరిస్తున్నాయి.
మరోవైపు కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో బీఆర్ఎస్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. బీజేపీ కూడా రాష్ట్రంలో విస్తరిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా పోటీ పడుతుండటంతో ఏ పార్టీకి మెజార్టీ వస్తుందో తెలియడం లేదు. బీఆర్ఎస్ పార్టీ తన ఉనికి కాపాడుకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తుందని చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భారం నుంచి తేరుకోకముందే పార్టీ నుంచి పలువురు వీడుతున్నారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. స్థానిక ఎన్నికల్లో కూడా పరాభవం ఎదురైతే కష్టమనే అభిప్రాయాలు వస్తున్నాయి. బీఆర్ఎస్ బలహీనలతో ఆ పార్టీకి నష్టాలే ఎక్కువగా వస్తున్నాయి. జూన్ లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకోవాలని బీఆర్ఎస్ ఆలోచిస్తోంది.
ఈనేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారయింది. పార్టీ విజయం సాధించకపోతే ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. ఓట్లు రాబట్టుకోవాలంటే జాతీయ పార్టీల భయం పొంచి ఉంది. దీంతో వచ్చే ఎన్నికలు బీఆర్ఎస్ కు ప్రతిష్ఠాత్మకంగా మారనున్నాయని తెలుస్తోంది. ఈ సవాల్ ను బీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సిందే.