KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో పార్టీ జెండాను ఎగురవేయగా మాజీ మంత్రులు, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
అనంతరం కేటీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ర్ట ఉద్యమ సమయంలో ప్రాణాలను అర్పించిన అమరవీరులకు కేటీఆర్ నివాళి అర్పించారు. ఎన్నికల్లో గెలుపోటములు అత్యంత సహజమేనని వ్యాఖ్యానించారు. గెలిచినా, ఓడినా తెలంగాణ ప్రజల తరపున పోరాడేది, వారి గొంతుకగా ఉండేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. తెలంగాణకు ఒక ఇంటి పార్టీగా ఉంటున్నద తామేనని, అలాంటి బీఆర్ఎస్ ను ఈ 24 సంవత్సరాలలో ప్రజలు ఎంతగానో ఆదరించారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ సేవకు తాము పునరంకితమవుతామని కేటీఆర్ ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ సమాజం చూపిన బాటలో పయనిస్తామని స్పష్టం చేశారు.