Sri Ramanavami : శ్రీరాముడు అందరివాడు. హైందవ సంప్రదాయంలో ఆదర్శ పురుషుడిగా రాముడికి ప్రత్యేక స్థానం ఉంది. సీతారాముల దాంపత్యాన్ని ఆదర్శంగా తీసుకునే భారత ప్రజల జీవనం సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీరాముడి జన్మదినం సందర్భంగా శ్రీరామ నవమి వేడుకలను శతాబ్దాలుగా ప్రతీ గ్రామంలోనూ వైభవంగా జరుపుకుంటున్నారు. ఇదే క్రమంలో విదేశాల్లోని భారతీయులు సైతం మన ఆచార సంప్రదాయాలు, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని మరిచిపోకుండా పలు హిందూ పండుగలను జరుపుకుంటున్నారు. అందులో అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీరామ నవమి వేడుకలను జరుపుకుంటున్నారు.
ఈనేపథ్యంలో వెస్ట్ లండన్ లోని లాంగ్లీలోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ (ఎస్వీబీటీసీసీ) ఆధ్వర్యంలో 202 శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. పురాతనమైన ఈ పండుగను ఘనంగా జరుపుకోవడం, భారతీయ సంస్కృతి కోసం ప్రచారం చేయడం ద్వారా ఈ సుందరమైన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.
ట్రస్టీలు, డాక్టర్ రాములు దాసోజు, భాస్కర్ నీల, శ్రీమతి కమలా కొచ్చెర్లకోట, ప్రవీణ్ కుమార్ యాదవ్, సురేశ్ గోపతి, సురేశ్ రెడ్డి గడ్డం, పావని రెడ్డి, కెకె చివుకుల, కార్యవర్గ సభ్యులు విశ్వేశ్వర్, తుకారాం రెడ్డి, రాఘవేందర్(రఘు), గౌతమ్ శాస్త్రి, రవి వాసా, గోపి కొల్లూరు, రవికుమార్, వంశీ వుల్చి, వంశీ బోగిరెడ్డి, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. బ్రాక్ నెల లో నూతనంగా ప్రారంభించిన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు దర్శించుకుని బాలాజీ ఆశీస్సులు పొందాలని కోరారు. ఐక్యత, సేవా స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ, వలంటీర్లు అంకితభావం, నిబద్ధతతో శ్రీరామనవమి వేడుకల కార్యక్రమాన్ని విజయవంతం చేశారని కొనియాడారు. హిందూ ధర్మం, బహుళ సాంస్కృతిక సామరస్యంతో లోతైన సంబంధాన్ని పెంపొందించడం ద్వారా ఆధ్యాత్మిక వైభవానికి ఈ వేడుకలు దోహదం చేస్తున్నాయన్నారు