Jagan Meets KCR : ఇవాళ షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈరోజే మాజీ సీఎం కేసీఆర్ ను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కలువనున్నారు. ఈ రెండు ఘటనలు ఏపీ రాష్ట్రంలో కీలక పరిణామాలకు దారితీయనున్నాయా? అని చర్చ సాగుతోంది. బాత్ రూంలో జారిపడి హిప్ రిప్లేస్ మెంట్ సర్జరీ చేయించుకున్న కేసీఆర్ ను అందరూ కలిసిన ఇంతవరకూ జగన్ మాత్రం కలువలేదు. ఆయన పరామర్శించకపోవడంతో ఈ అంశం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఎట్టకేలకు ఈరోజు హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని కేసీఆర్ నివాసంలో ఆయన్ను జగన్ పరామర్శించనున్నారు.
ప్రస్తుతం కేసీఆర్ డాక్టర్ల పర్యవేక్షణలోనే మెల్లగా నడుస్తున్నారు. పూర్తిగా కోలుకోవడానికి నెల రోజులు పడుతుందని డాక్టర్లు చెప్పారు. కేసీఆర్ ను సీఎం జగన్ కలువడానికి వెనక పరామర్శ కన్నా రాజకీయ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉన్నట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీతో పాటు, టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కూడా చేరనుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్-జగన్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కేసీఆర్ ను తన రాజకీయ గురువుగా జగన్ భావిస్తారు. అలాగే జగన్ ను తన సోదరుడిగా కేటీఆర్ భావిస్తారు. అలాగే ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. ఈవిషయాన్ని పలు సందర్భాల్లో కేటీఆర్ ఓపెన్ గానే ఒప్పుకున్నారు. జగన్, తాను మంచి మిత్రులమని, కలిసినప్పుడు చాలా బాగా మాట్లాడుకుంటామని కూడా చెప్పారు. రాజకీయంగా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, రాష్ట్రాల పరంగా మాత్రమే ఉంటాయని తెలిపారు. అయితే గత ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవడంతో వైసీపీ తమకేం పట్టనట్టుగానే వ్యవహరించింది. ఇప్పుడు కేసీఆర్ తో కలిసే రాజకీయాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారేమో కానీ జగన్ ఆరోగ్య, రాజకీయ పరామర్శకు బయలుదేరారు.
ఇప్పుడీ విషయంపైనే రెండు రాష్ట్రాల్లో తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఏపీలో రెండో సారి సీఎం కావాలని జగన్ ఆ మేరకు వ్యూహాలు రచిస్తున్నారు. టీడీపీ-జనసేన కూటమి జెండా ఎగురవేయబోతోందని సర్వేలు వెల్లడిస్తుండడంతో జగన్ కు భయం పట్టుకున్నట్టు కనిపిస్తోంది. అలాగే చెల్లి షర్మిల కాంగ్రెస్ లో చేరిక… వీటన్నంటిపై అపర చాణక్యుడైన కేసీఆర్ ను కలిసి సలహాలు, సూచనలు తీసుకోవడానికే పరామర్శ పేరుతో జగన్ వెళ్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.