- తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న నాయకుల తీరు
తెలుగు రాష్ర్టాల్లో చాలా మంది రాజకీయ నాయకులు వివాదస్పద వ్యాఖ్యలనే తమను హీరోలుగా చేస్తాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో తమ కుటుంబాలను కూడా రోడ్డుకులాగేసుకుంటున్నారు. తాజాగా తలసాని వ్యాఖ్యలతో పాటు రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఏపీలో కొడాలి నాని, వల్లభనేని వంశీ తదితర నేతల నోరు తెరిస్తే చాలు ప్రత్యర్థులపై తిట్ల దండకాన్ని మొదలుపెడుతున్నారు. ఇదే తమను ప్రజల్లో హీరోలుగా నిలబెడుతుందని వారు భావిస్తున్నట్లు గా కనిపిస్తున్నది. తెలుగు భాషలో ఉన్న బూతులన్ని సభ్య సమాజంలోకి వదులుతున్నారు.
వారు.. వీరు.. అంతా ఒకే కోవలోకి..
తెలుగు రాష్ర్టాల్లో కొందరు నాయకులు జుగుప్సాకర మాటలతో విరుచుకుపడుతున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాం అనే సోయి లేకుండా మాట్లాడుతున్నారు. పిల్లలు , మహిళలు అనే గౌరవం లేకుండా ఇష్టరీతిలో రెచ్చిపోతున్నారు. ఇందుకు అగ్రనేతలు ఏం తక్కువ తినడం లేదు. అవసరమైన సందర్భాల్లో వారు కూడా తమ నోటికి పనిచెబుతున్నారు. వామ్మో ఇవేం మాటలు రా నాయనా అని చెవులు మూసుకునేలా కొందరు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈ తిట్ల దండకం ఏపీలో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లోనూ వినిపిస్తున్నది. రాజకీయాల్లో విమర్శలు సహజమే. గతంలో కొంత హుందా రాజకీయాలు కనిపించేవి.
ఇప్పుడు ఎంత తిడితే అంత మైలేజీ అనే రీతిలో నేతల ప్రవర్తన కొనసాగుతున్నది. వీరిని చూసి ద్వితీయ శ్రేణి నేతలు తామేం తక్కువ తినలేదు అన్నరీతిలో ప్రవర్తిస్తున్నారు. తమకు ఎదురు తిరిగిన ప్రజలను కూడా ఇలానే దుర్భాషలాడుతున్నారు. అధికారులను అసభ్య పదజాలతో కుళ్లబొడుస్తున్నారు. బాధ్యతాయుత పదవిలో ఉన్నామనే సోయి మరిచిపోయి మనల్ని ఎవరేం అంటారనే ధోరణి కనిపిస్తున్నది. ఇక రానున్న రోజుల్లో ఇంకెన్ని చూడాల్సి, వినాల్సి వస్తుందోనని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వీరి తిట్ల కోసం ఇంట్లో వారిని కూడా బయట పడేయడం కొంత ఆందోళన కలిగించే అంశం. తమ ఇంట్లో సభ్యులున్నారనే విషయం మరిచి పెట్రేగి పోతున్న నేతలకు ఆయా పార్టీలే మూకుతాడు వేయాల్సిన అవసరం ఉంది.