KCR : తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వచ్చి.. సౌత్ లోనే తొలి సీఎంగా రికార్డు సృష్టించాలనుకున్న కేసీఆర్ ఆశలు నెరవేరలేదు. గత అసెంబ్లీ ఎన్నికలు ఆయన్ను తీవ్రంగా నిరాశ పరిచాయి. గత పదేళ్లలో ఎన్నో పథకాలు తెచ్చి తెలంగాణను ‘బంగారు తునక..?’గా మార్చినా ఓటర్లు తన పార్టీని ఓడించడంపై ఆయన ఆవేదన చెందుతున్నారు. గత 20ఏండ్లుగా తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ నడిచాయి రాజకీయాలు. టీఆర్ఎస్ వ్యవస్థాపన నుంచి మొన్నటి వరకు ఆయన పేరు లేనిదే తెలంగాణ రాజకీయాలు లేవనే చెప్పాలి. ఉద్యమకారుడిగా, సీఎంగా ఆయన పాత్ర ఎవరూ మరిచిపోలేనిది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి కేసీఆర్ స్వయంకృతపరాధమే అని చెప్పవచ్చు. ఆయన కొన్ని మార్పులు చేసి ఉంటే బీఆర్ఎస్ కు తిరుగుండేది కాదన్నది అందరికీ తెలిసిందే. అహంకార పూరిత పోకడ, ప్రజలను ఓటర్లుగా మాత్రమే భావించడం, ఉద్యోగాల భర్తీలో చిత్తశుద్ధి లేకపోవడం, నిరుద్యోగులపై కక్షపూరిత ధోరణి, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను పట్టించుకోకపోవడం, ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చకపోవడం..ఇలా పలు అంశాలను కేసీఆర్ తక్కువ అంచనా వేయడమే ఆయన ఓటమికి దారితీసిందనే చెప్పాలి.
ప్రధానంగా నిరుద్యోగుల ఓట్లతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనేది దాచలేని నిజం. గత పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల కక్షపూరితంగా ప్రవర్తించిందనే చెప్పాలి. లీకేజీలు, పరీక్షల రద్దు, వాయిదాలపై ఏనాడూ కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదు. నిరుద్యోగులకు అండగా ఉంటామని ఏ రోజూ భరోసా ఇవ్వలేదు. మ్యానిఫెస్టోలో నిరుద్యోగుల ఊసే లేదు. ప్రచార సభల్లో కూడా నిరుద్యోగులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చింది లేదు. ఇవన్నీ నిరుద్యోగులను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి. నీళ్లు, నిధులు, నియామకాలు.. అని స్లోగన్స్ ఇచ్చిన ఉద్యమ నాయకుడే నిరుద్యోగులపై ఇలా వ్యవహరించడాన్ని వారు సహించలేకపోయారు. కేసీఆర్ ను ఓడిస్తేనే తమ ఆవేదనకు అర్థం ఉంటుందని, ఇష్టంలేకపోయిన కాంగ్రెస్ కు ప్రచారం చేసి మరీ గెలిపించారు. ఈ విషయంలో కేటీఆర్ తాజాగా స్పందిస్తూ.. నిరుద్యోగులు, ఉద్యోగుల విషయంలో తమ ప్రభుత్వం కొన్ని తప్పులు చేసిందని, వాటితోనే తమకు అధికారం దూరమైందని ఒప్పుకున్నారు.
తాజాగా తెలంగాణలో అన్ని పార్టీలు లోక్ సభ సమరానికి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని సర్వే సంస్థలు కూడా తమ అంచనాలను వెల్లడించాయి. ఈ ఎన్నికలు బీఆర్ఎస్ కు కీలకం కాబోతున్నాయి. ముక్కోణ పోటీలో ఎక్కువ సీట్లు సాధిస్తేనే ఆ పార్టీ క్యాడర్, నేతలు ఇతర పార్టీలకు జంప్ కాకుండా ఉంటారు. ఒకవేళ సత్తా చాటకుంటే జాతీయ పార్టీల ధాటికి తట్టుకోవడం కష్టమే. అప్పుడంటే ఉద్యమ పార్టీ కాబట్టి.. జనాల్లో కూడా ఫైర్ ఉంది కాబట్టి టీఆర్ఎస్ ను కాపాడుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడలా కాదు ఫక్తు రాజకీయ పార్టీ. ప్రజలకు నేతలు, పార్టీ పనితీరు నచ్చితేనే ఓటేస్తారు. రాబోయే ఎన్నికల ద్వారా బీఆర్ఎస్ తన భవిష్యత్ ను రచించుకోనుంది.
దీని కోసం కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాలను కేటీఆర్ కు వదిలేసి.. జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మెదక్ ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. తాను పోటీ చేయడం ద్వారా పార్టీకి మైలేజ్ వస్తుందని, తద్వారా ఎక్కువ సీట్లు సాధించి తెలంగాణపై పట్టు నిలుపుకోవాలని ఆయన ఆశిస్తున్నారు. మరో ఐదేండ్ల వరకు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం లేదు కనుక..పార్టీని మరింత బలోపేతం చేయడంపైనే ఆయన దృష్టి సారిస్తున్నారు.