KCR Nomination In Two Places : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బాస్, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు నామినేషన్ వేశారు. సీఎం ఈ సారి రెండు స్థానాల్లో నిలబడుతున్నారని తెలిసిందే. 1. గజ్వేల్, 2. కామారెడ్డి. ఈ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్న గులాబీ బాస్ రెండింటిలో భారీ మెజారిటీతో గెలవాలని పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు (నవంబర్ 9) రెండు స్థానాల్లో నామినేషన్ (నామపత్రాలు) సమర్పించారు. గతంలో మాదిరిగానే సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో కేసీఆర్ పూజలు చేశారు. నవంబర్ 4న ఆలయాన్ని సందర్శించిన ఆయన తన నామినేషన్ పత్రాలను దేవుడి పాదాల వద్ద ఉంచారు.
ఉదయం గజ్వేల్ లో నామినేషన్ సమర్పించిన కేసీఆర్.. సాయంత్ర 2 గంటల సమయంలో కామారెడ్డిలో నామినేషన్ వేశారు. రెండు చోట్ల ఆయన నామినేషన్ ను పురస్కరించుకొని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ క్రౌడ్ ను చూసిన మిగతా పార్టీలు కేసీఆర్ రెండు స్థానాల్లో గెలవడం ఖాయమని అనుకుంటున్నారు. గజ్వేల్ నామినేషన్ దాఖలు ముగిసిన తర్వాత ఆయన అభినందనలు తెలిపారు. ప్రచార వాహనంలో హెలీ ప్యాడ్ చుట్టూ తిరుగుతూ తన నామినేషన్ కు వచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ వ్యూహ ప్రతి వ్యూహాలు ఎవరికీ అందవు. ఆయన బరిలోకి దిగారంటే చాలు ప్రత్యర్థులు ఇబ్బందులు పడాల్సిందే.
రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలో కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నానని చెప్పిన కేసీఆర్ అక్కడ గెలుపుపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రెండు చోట్ల గెలిస్తే ఈ సారి గజ్వేల్ ను వదులుకుంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రెండు చోట్ల కేసీఆర్ గెలుపు నల్లేరుపై నడకే అంటూ కూడా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.