- ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నదేనా..
- మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడం కష్టమంటున్న సర్వేలు
king maker of Karnataka : కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు బుధవారం ముగిశాయి. వివిధ సంస్థలు, ఛానళ్ల సర్వే ఫలితాలు బయటకు వచ్చాయి. మిక్కిలి సంఖ్యలో సర్వేల్లో కాంగ్రెస్ కే అధికారమని తేలుతున్నా, మరికొన్ని బీజేపీ గట్టి పోటీనిచ్చిందని కచ్చితంగా అధికారం నిలబెట్టుకుంటుందని చెబుతున్నాయి. ఒకవేళ అటు.. ఇటుగా సీట్లు వస్తే జేడీఎస్ నేత ఇక్కడ కింగ్ మేకర్ గా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..
కుమారస్వామి నెగ్గుతాడా..?
ఈ సారి ఎన్నికలను అన్ని పార్టీలు కీలకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ అనిపించినా, జేడీఎస్ కూడా ఇక్కడ గట్టి పోటీదారు అనే చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉన్నాయి. పీపుల్స్ పల్స్ సంస్థ కాంగ్రెస్కు 107-119 ఇవ్వగా, బీజేపీకి 90 వరకు వస్తాయని చెప్పింది. జీ న్యూస్ కాంగె్రస్ 103-119 ఇవ్వగా, బీజేపీకి కేవలం 94 రావొచ్చని చెప్పింది. అయితే సీ ఓటర్, సువర్ణ న్యూస్, తదితర సంస్థలు కాంగ్రెస్ కు అత్యధిక మెజార్టీ ఖాయమని తమ సర్వేలో వెల్లడించాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ లేదా బీజేపీ ముందంజలో ఉన్నా, మ్యాజిక్ ఫిగర్ అందుకుంటాయా అనేది సంశయం. ఒక వేళ ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ రాకుంటే జేడీఎస్ మద్దతు కీలకంగా మారనుంది. కుమారస్వామి కింగ్ మేకర్ కానున్నారు.
113 సీట్లు సాధ్యమేనా..?
కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా 113 సీట్లు సాధించాల్సి ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ నేపథ్యంలో ఇప్పుడు మద్దతు తప్పనిసరి అని వాదన వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో కుమారస్వామి ఎవరికి మద్దతునిస్తారో వారే అధికార పీఠాన్ని ఎక్కనున్నారు. ఒకవేళ తానే సీఎం కావాలని భావిస్తే ఇక కింగ్ మేకర్ అనే పదానికి ఆయనే సరిపోలుతారు. శనివారం వెలువడే ఫలితాలతో ఈ సందిగ్ధం తొలగనుంది. కేంద్రంలోని బీజేపీ ఏ చిన్న ఛాన్స్ ఉన్నా అధికారాన్ని ఛేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తుంది. అవసరమైతే కుమారస్వామి ఆఫర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. మరోవైపు కర్ణాటకలో పాగా వేయడం ద్వారా వచ్చే అన్ని ఎన్నికలకు దీటుగా సిద్ధమవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నది. మరి ఇప్పుడు మెజార్టీ ఓటరు ఏం నిర్ణయించుకున్నాడో తెలియలాంటే మరో రెండు రోజులు ఎదురుచూడాల్సిందే..