KTR met Amit Shah : రాజకీయంలో శాశ్వత శత్రువు.. శాశ్వత మిత్రుడు ఉండడని మనకు తెలిసిందే. తెలంగాణలో మరో నాలుగు నెలల్లో ఎన్నికల కోడ్ రాబోతోంది. ఈ నేపథ్యంలో చాలా నెలల నుంచి రాష్ట్రంలో రాజకీయాలు వేడేక్కుతున్నాయి. ఇందులో భాగంగా బీఆర్ఎస్, బీజేపీ హోరా హోరీగా మాటలను సంధించుకున్నాయి. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను కలువనున్నారు. ఈ టూర్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు అగ్ర మంత్రులను నకలిసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ మంత్రి తారక రామారావు ఢిల్లీకి వెళ్లాలని తీసుకున్న నిర్ణయం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ టూర్ విషయాలు గురువారం సాయంత్రం వెలుగులోకి వచ్చాయి. అయితే కేటీఆర్ వారి అపాయింట్మెంట్ కోరినట్లు రహస్యంగా ఉంచారు. రెండు రోజుల పాటు దేశ రాజధానిలోనే కేటీఆర్ ఉండనున్నారు.
ఈ సమావేశం పూర్తిగా అధికారికమేనని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ కేంద్ర మంత్రులను కలిసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గానీ, ఆయన కుమారుడు కే తారకరామారావు గానీ ఢిల్లీకి వెళ్లకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేంద్ర మంత్రి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా తండ్రీకొడుకులు పట్టించుకోలేదు. జాతీయ బీజేపీ నేత ఎవరైనా హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ఆయనపై విరుచుకుపడేవారు. ఇప్పుడు కేటీఆర్ స్వయంగా ఢిల్లీ వెళ్లి అమిత్ షా తదితరులను కలవడం మీడియాలో అనేక ఊహాగానాలకు దారితీసింది.
కేసీఆర్ కుమార్తె కవిత ప్రమేయం ఉన్న ఢిల్లీ మద్యం కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు నేపథ్యంలో బీజేపీపై బీఆర్ఎస్ వైఖరిలో వచ్చిన మార్పును ఈ సమావేశాలు ప్రతిబింభించాయని ఒక వర్గం మీడియా ఊహాగానాలకు తెరలేపింది. బహుశా కేంద్రంతో సయోధ్య కుదుర్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన ఇటీవలి కాలంలో బీజేపీపై తన దాడిలో దూకుడును తగ్గించి, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో తనకు అసలైన ముప్పుగా మారిన కాంగ్రెస్ పై దాడి చేస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణకు ఎలాంటి ఆర్థిక సాయం చేయనందుకు కేంద్రంపై నిందలు వేయాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. కేసీఆర్, ఆయన మంత్రులు ఏనాడూ తెలంగాణకు సంబంధించిన ప్రధాన అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేదని, అందువల్ల బీజేపీ నాయకత్వాన్ని నిందించే అర్హత లేదని బీజేపీ నేతలు ఇన్నాళ్లూ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదు నెలల సమయం మాత్రమే ఉండటంతో కేసీఆర్ తన కుమారుడిని ఢిల్లీకి వెళ్లి తెలంగాణ పెండింగ్ సమస్యలను కేంద్రం, ముఖ్యంగా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.
ప్రాజెక్టులను మంజూరు చేయడం, నిధులు విడుదల చేయడం ద్వారా కేసీఆర్ కు ఎలాంటి క్రెడిట్ ఇవ్వడం బీజేపీ నాయకత్వానికి ఇష్టం లేదన్నది సుస్పష్టం. కేటీఆర్ విజ్ఞప్తులు చేసినా కేంద్రం రాష్ట్రానికి సాయం చేయడం లేదని, వచ్చే ఎన్నికల్లో దీన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారని మరో విశ్లేషకుడు అంటున్నారు.