Brij Bhushan : తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించం.. చర్యలు తీసుకుంటాం. మా పార్టీ వారైనా సరే వదిలి పెట్టబోం. ఇది పార్టీల అధినేతలు చెప్పే మాటలు. అయితే మనోడైతే మాఫీ అనే చందంగా అన్ని పార్టీల్లో ఇదే కథ నడుస్తున్నది. ముఖ్యంగా బీజేపీ తీరుపై ఇందులో విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న నేతలపై సీబీఐ, ఈడీ దాడులు చేయించడం, ఆ తర్వాత వారు బీజేపీ లో చేరితే పునీతులుగా వదిలి పెట్టడం సర్వ సాధారణమైంది.
అయితే ఇక్కడ ఈ కేసు మాత్రం విభిన్నం. స్వయాన దేశానికి ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన మన దేశ ఆణిముత్యాల అంశం. మమ్మల్ని ఒకడు లైంగికంగా వేధిస్తున్నాడని ఏకంగా దేశ రాజధాని రోడ్లపై ఆందోళనకు దిగిన సదరు వ్యక్తిపై ప్రధానితో సహా కేంద్ర పెద్దలెవరూ నోరు మెదపడం లేదు. కనీసం ఆ ఆందోళనను పట్టించుకోవడం లేదు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై, విమర్శలు వ్యక్తమవుతున్నా దిద్దుబాటు చర్యలకు దిగడం, కేవలం తమ పార్టీ ఎంపీ అయితే తప్పు చేసినా వారిపై చర్యలుండవనే సంకేతాలు ప్రజల్లోకి పంపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎవరీ బ్రిజ్ భూషణ్ సింగ్..
బ్రిజ్ భూషణ్ సింగ్. యూపీకి చెందిన బీజేపీ ఎంపీ. ప్రస్తుతం భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. యూపీలో బాహుబలి నేత అని పేరుంది. ఆ స్థాయిలో చక్రం తిప్పే నేత ఈయన. అత్యంత వివాదాస్పదుడు. ఏకంగా బహిరంగ సభల వేదికలపైనే తాను గతంలో హత్యలు చేసినట్లుగా గొప్పగా చెప్పుకుంటాడు. గతంలో ఈయనపై ఎన్నో నేరారోపణలు ఉన్నాయి.
గతంలో ఏకంగా ఓ ఎస్పీకి గన్ ఎక్కుపెట్టినట్లు కూడా ప్రచారంలో ఉంది. తన ఆగడాలను ప్రశ్నించిన ఓ వ్యక్తని బహిరంగ సభ వేదిక మీదే తీవ్రంగా కొట్టాడు. అండర్ వరల్డ్ తో సంబంధాలు ఉన్నాయనే కారణంతో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో టాడా చట్టం కింద ఈయన జైల్లో పెట్టారు కూడా. ప్రస్తుతం ఈయన కుటుంబమంతా కూడా రాజకీయాల్లోనే ఉంది. ఒక కొడుకు ఎమ్మెల్యే, భార్య ఒక జిల్లా పంచాయతీ అధ్యక్షురాలు. మరో కొడుకు, అల్లుడు కూడా వివిధ హోదాల్లో ఉన్నారు. ఇలాంటి వ్యక్తిని రెజ్లింగ్ సమాఖ్యకు అధ్యక్షుడిగా చేయడం విడ్డూరమేమరి.
ఆటగాళ్లు ఏమంటున్నారంటే..
బజరంగ్ ఫూనియా, ఫొగట్, తదిరత ప్రముఖ రెజ్లర్లంతా ఆందోళనకు దిగారు. మూడు నెలలు దాటినా కేంద్రం స్పందించలేదు. సదరు వ్యక్తిపై వేసిన కమిటీ నివేదిక ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం ఆ నివేదికను బయటపెట్టలేదు. దీంతో ఇటీవల మరోసారి ఆటగాళ్లు నిరసన ప్రదర్శనలకు దిగారు. దేశావ్యాప్తంగా వారికి మద్దతు పెరుగుతున్నది. రైతు సంఘాల నాయకులు కూడా వీరికి మద్దతుగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. దేశం తరఫున ఆడి, పతకాలు తెచ్చిన మన బిడ్డల గోసను మోదీ పట్టించుకోకపోవడం సరికాదని, దీనిపై సమగ్ర విచారణను త్వరగా ముుగించేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తున్నది. మరి బీజేపీకి మచ్చలా మారిన ఈ అంశానికి ముగింపు ఎప్పుడు పలుకుతుందో చూడాలి.