Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్) నివాసంలో పనిచేసే వ్యక్తి ఇంట్లో భారీ ఎత్తున నగదు పట్టుబడింది. ఇది దాదాపు రూ. 34 కోట్లని, ఇదంతా లెక్కల్లోకి రాని సొమ్మేనని అధికారులు పేర్కొంటున్నారు.
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన వీరేంద్రకుమార్ రామ్ గత సంవత్సరం రూ. 10 వేల లంచం తీసుకున్న కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఆయనను అదుపులోకి తీసుకొని విచారించాక సీన్ మారిపోయింది. ఆయన ఇచ్చిన సమాచారంతో సోమవారం రాష్ట్ర రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిపింది. కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగిర్ ఆలం పీఎస్ సంజీవ్ లాల్ ఇంట్లో పని మనిషిగా ఉన్న జహంగీర్ ఆలం అనే వ్యక్తి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. అక్కడ రూ. 500 నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడ్డాయి.
ఒడిసాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న పీఎం మోదీ ఈ వ్యవహారాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘ఝార్ఖండ్ లో నోట్ల గుట్టలు బయటపడ్డాయి. పనిమనిషి ఇంటినే అవినీతి గోౌన్ గా మార్చారు. నగదు లెక్కింపు యంత్రాలే అలిసిపోయేంతగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఇదంతా కాంగ్రెస్ ప్రథమ కుటుంబం తాలూకు నల్లధనమేనా..? దీనిపై యువరాజు సమాధానం చెప్పాలి’ అని మోదీ ప్రశ్నించారు.