North Telangana BRS : అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దీంతో రాష్ట్రంలో ఆయా పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్టీలు, నాయకులు ఓటు బ్యాంకును క్షుణ్ణంగా విశ్లేషించి వ్యూహాలు రచిస్తున్నారు. ప్రాంతాల వారీగా పరిశీలిస్తే ఉత్తర తెలంగాణ చాలా వెనుకబడి ఉందని స్పష్టమవుతోంది.
ఈ ప్రాంతంలోని పలు కీలక జిల్లాలు ఇంకా అభివృద్ధి చెందలేదు. ఈ జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీల జనాభా గణనీయంగా ఉంది. వారి ఓట్లు రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, ఈ ప్రాంతాల్లో అభివృద్ధి, ఉద్యోగ అకాశాలు, ఉపాధి అవకాశాలు కరువయ్యాయి. ఫలితంగా ఉత్తర తెలంగాణ ప్రజలు కొంత నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలు ఉన్నాయి.
వీటిల్లో నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల జిల్లాలు అభివృద్ధి చెందుతుండగా, మిగిలిన జిల్లాల్లో తాగునీరు కూడా అందకపోవడం, ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు కాకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నాయి. ఒకప్పుడు ప్రజలతో బలమైన సంబంధాలున్న నేతలు ఇప్పుడు దూరమై అలసిపోయినట్లు కనిపిస్తున్నారంటే ఈ ప్రాంతంలో జరిగిన బీఆర్ఎస్ నేతల సమావేశానికి వచ్చిన స్పందనే నిదర్శనం.
అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కూడా స్థానిక ప్రజల్లో ఉత్సాహాన్ని నింపలేకపోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ప్రజలు వారి ప్రసంగాలను వింటున్నప్పటికీ, రాజకీయ వాక్ ఛాతుర్యంపై సాధారణ ఉదాసీనత కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపించడం లేదు.
అయితే మార్పును కోరుకునే వారు క్రియాశీలకంగా ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు. ఆదివాసీల జీవితాల్లో మార్పు తెచ్చామని అధికార పార్టీ చెప్పుకుంటే ఉత్తర తెలంగాణలో వారి సమావేశాలు మరోలా సూచిస్తున్నాయని, రాబోయే ఎన్నికల్లో వారికి గడ్డుకాలం తప్పదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.