Pawan meeting with Amit Shah : బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. 45 నిమిషాలు చర్చలు జరిగిన అనంతరం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అమిత్ షా నివాసం నుంచి బయటకు వెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ – జనసేన పొత్తు గురించి ఈ భేటీలో చర్చించారు. సీట్ల సర్దుబాటు అంశంలో చర్చ కొనసాగిందని సమాచారం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని ఇప్పటికే జనసేన అధినేత పవన్ ను బీజేపీ నేతలు కోరారు. అయితే తెలంగాణలో 20కి పైగా స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావిస్తున్నది. ఈ నేపథ్యంలో అమిత్ షాతో పవన్ భేటీ కీలకంగా మారింది. పవన్ తో ఈ నెల 18న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ భేటీ అయ్యారు. ఎన్నికల్లో జనసేన మద్దతు కోరారు. అయితే ఈ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేయాలని తమ పార్టీ నేతలు సన్నద్దతను తెలియజేసిన విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్. జనసేన ఏయే నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలనే జాబితాను కూడా జనసేన విడుదల చేసింది. అయితే పొత్తులో భాగంగా 20 స్థానాలు కేటాయించాలని అంతర్గతంగా ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తున్నది.
వాస్తవానికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాదిరిగానే జనసేన పోటీ చేయకుండా పూర్తిగా బీజేపీకి మద్దతు ఇవ్వాలని బీజేపీ నేతలు కోరాలని భావించారు. కానీ జనసేన నేతలు ముందుగా పవన్ కళ్యాణ్ ముందు ఈ సారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేయాలని, లేకుంటే పార్టీ క్యాడర్ దెబ్బతింటుందని.. సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. దీంతో జనసేన ఈ సారి ఎన్నికల్లో బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేయాలన్న నిశ్చయంతో ఉంది. జనసేనతో పొత్తు, సీట్ల కేటాయింపుపై అమిత్ షా ఎలా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.
అమిత్ షా హామీ..
అమిత్ షా తో భేటీ సమయంలో పవన్ ఏపీకి సంబంధించి అంశాలను ప్రస్తావించారు. ఏపీకి అన్ని రకాలుగా అండగా నిలుస్తామని..రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. అయితే, టీడీపీతో పొత్తు ప్రకటన వెనుక కారణాలను బీజేపీ ముఖ్యులకు వివరిస్తామని పవన్ పదే పదే చెబుతూ వచ్చారు. ఈ భేటీలో టీడీపీ ప్రస్తావన రాలేదని సమాచారం.
కేవలం తెలంగాణలో మాత్రమే కలిసి పని చేసే విషయం చర్చకు వచ్చినట్లు తెలిసింది. బీజేపీ..జనసేన కలిసి తెలంగాణలో పని చేయడంపైనే ఇప్పటికే చర్చలు జరిగాయని జాతీయ నాయకత్వంతో చర్చిద్దామని పవన్ ప్రతిపాదించటడతో ఈ సమావేశం ఏర్పాటైనట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. జనసేన ఒక్కటే ఎన్డీఏ భాగస్వామి..అంతవరకే తమ చర్చలు ఉంటాయని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. పార్టీ ఆలోచన ఏంటనేది దీని ద్వారా స్పష్టం చేశారు.