Janasena Seats : ఏపీలో మరో మూడు, నాలుగు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. వైసీపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్తుండగా.. టీడీపీ, జనసేన కూటమిగా బరిలో దిగుతున్నాయి. ఈక్రమంలో సీట్లపై చర్చలు నడుస్తున్నాయి. అయితే సొంతంగా పార్టీలో సీట్ల సమీకరణాలపై చర్చించుకుని, ఆ తర్వాత టీడీపీతో ఆ వ్యవహారంపై మాట్లాడవచ్చని జనసేన అధిపతి పవన్ కల్యాణ్ భావించారు. అందులో భాగంగా జనసేన నేతలతో వరుసగా చర్చలు జరుపుతున్నారు. ఎక్కడెక్కడ పోటీ చేయాలి? మన బలమెంత? ప్రత్యర్థుల బలమెంత? అనే విషయాలు చర్చిస్తున్నట్టు తెలిసింది. వీటన్నింటిపై క్లారిటీ వస్తేనే పొత్తు సీట్లపై టీడీపీతో చర్చలకు దిగే అవకాశం ఉంది.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసే కేంద్ర కార్యాలయంలో పవన్ పార్టీ నేతలతో కీలక చర్చలు జరుపుతున్నారు. ఇందులో రానున్న ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలపై చర్చిస్తున్నారు. ఈ చర్చలకు జనసేన పీఏసీ సభ్యులు, పార్టీ కీలక నేతలను పిలిచారు. వీరి అభిప్రాయాల ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకునేందుకు పవన్ రెడీ అవుతున్నారు.
జనసేన పార్టీ ఆఫీసులో నేతల బలాబలాలపై పవన్, నాదెండ్ల ఇవాళ చర్చలు జరుపుతున్నారు. టీడీపీ, జనసేన పొత్తు నేపథ్యంలో ఇరుపక్షాల కార్యకర్తలు కలిసి పనిచేసేలా తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చిస్తున్నారు. ముఖ్యంగా జనసేన పోటీ చేయబోయే స్థానాల్లో ఇరుపక్షాల బలాబలాలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చర్చలు రేపు, ఎల్లుండి కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, కృష్ణా, గుంటూరు, తిరుపతి, అనంతపురం జిల్లాల నేతలతో పవన్ ఇవాళ చర్చిస్తున్నారు.
ఈ చర్చల తర్వాత జనసేన పోటీచేసే స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అనంతరం టీడీపీతో సీట్ల సర్దుబాటు చర్చలు చేస్తారని నేతలు చెపుతున్నారు. ఇప్పటికే టీడీపీ జనసేనకు 25 నుంచి 28 సీట్లు ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వీటిలో ఏయే స్థానాలు తీసుకోవాలనే అంశంపై పవన్ ఇప్పుడు చర్చిస్తున్నట్టు సమాచారం. అలాగే సీఎం సీటు చంద్రబాబుకు అప్పగించడంపై హరిరామజోగయ్య వంటి సీనియర్లు పవన్ ను ప్రశ్నించడంపై కూడా చర్చ నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయమై జనసైనికులకు పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.