రాహుల్ గాంధీపై అనర్హత వేటు విషయం ఇప్పట్లో తేలేలా లేదు. హైకోర్టులో ఊరట లభిస్తుంది అని భావించిన కాంగ్రెస్ శ్రేణులకు షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. బెయిల్ మాత్రం మంజూరు చేసింది. రాహుల్ గాంధీ పిటిషన్పై వేసవి సెలవుల తర్వాత జూన్ 4న తుది తీర్పును వెలువరిస్తామని కోర్టు తెలిపింది. పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
రాహుల్ గాంధీ తన శిక్షను నిలుపుదల చేయాలంటూ రాహుల్ గాంధీ చేసిన విజ్ఞప్తిని సూరత్ సెషన్స్ కోర్టు ఏప్రిల్ 20న తిరస్కరించింది. దీంతో రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. గత బుధవారం, గుజరాత్ హైకోర్టుకు చెందిన జస్టిస్ గీతా గోపి ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కేసును జస్టిస్ హేమంత్ ప్రచ్చక్కి అప్పగించారు.
ఏప్రిల్ 13, 2019న కర్ణాటకలోని కోలార్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో “దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది?” అని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. దీనిపై సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మార్చి 23న రాహుల్ గాంధీ దోషిగా తేలుస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అప్పిల్ చేసుకునేందుకు నెల రోజుల సమయం కూడా ఇచ్చింది. అయితే రాహుల్ కు శిక్ష పడి తర్వాత లోక్ సభ సెక్రెటెరియట్ ఆయన అనర్హత వేటు వేసింది.
రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన వయనాడ్ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తే సమస్య మరింత జఠిలమవుతుందని కోర్టుకు తెలిపింది. ఒక వేళ ఆ ఎన్నికల్లో వేరే అభ్యర్థి విజయం సాధించి.. తన శిక్షను రద్దు చేయాలన్న రాహుల్గాంధీ పిటిషన్ నెగ్గితే.. ఆయనకు తిరిగి ఎంపీ బాధ్యతలు అప్పగించడానికి అవకాశం ఉండదని తెలిపింది.