Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజలు వానలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ తెలిపింది. మే 9వ తేదీ వరకు తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. ముందు హెచ్చరికగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ వర్షాల వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ వర్షాలతో గరిష్ఠ ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతుందని వివరించింది. హైదరాబాద్ లో కూడా ఈదురు గాలులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆదివారం సాయంత్రం ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వర్షం పడింది. పలు ప్రాంతాల్లో కరెంటు స్తంభాలు, చెట్లు నేల కూలాయి.