ఎన్నికలు సమీపిస్తున్న వేళ అమిత్ షా టూర్ బీఆర్ఎస్, కేంగ్రెస్ పార్టీ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అయితే అమిత్ షా నేరుగా రంగంలోకి దిగితే వార్ వన్ సైడ్ అయిపోతుందని పార్టీ నాయకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం (జూన్ 14) తెలంగాణ పర్యటన చేయడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. గురువారం (జూన్ 15) ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారితో భేటీ కానున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం తెలంగాణ పర్యటన చేపట్టనున్నారు. ఇందులో భాగంగా రాత్రి 11.55 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు పార్టీ ప్రముఖులు వెళ్లనున్నారు. ఆ తర్వాత నోవాటెల్ హోటల్ లో రాత్రి బస చేస్తారు. అటు తర్వాత గురువారం (జూన్ 15) ఉదయం వివిధ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు.
గురువారం అమిత్ షా హైదరాబాద్ లో ప్రముఖులను కలవనున్నారు. మరి కొన్ని నెలల్లో రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ ఎలా పోరాడాలి.. అందుకు తగ్గ వ్యూహాలను చర్చించనున్నట్లు తెలుస్తోంది. పార్టీని తెలంగాణలో ప్రభుత్వంలోకి తేవాలని ఆ దిశగా ముఖ్య నాయకులకు, ప్రముఖులకు సూచనలు ఇవ్వనున్నారు అమిత్ షా. ఇక మోడీ 9 సంవత్సరాల పాలన, ప్రజలకు అందిన ఫలాలపై ‘మహాజన్ సంపర్క్ అభియాన్’లో భాగంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే విషయాన్ని కూడా ఆయన ముఖ్య నాయకులను అడిగి తెలుసుకోనున్నారు.
ఉదయం 11 గంటలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను ఆయన నివాసంలో కలువనున్నారు అమిత్ షా. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీరి భేటి మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవలి కాలంలో ఆర్కే (రాధాకృష్ణ)కు కేసీఆర్ కు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలో ఆర్కేను అమిత్ షా కలువడం వెనుక పెద్ద ప్లాన్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో పాటు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళిని కూడా మణికొండలోని ఆయన నివాసంలో కలవనున్నారు. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు బీజేపీ నుంచి రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు. రాజమౌళితో కూడా ఆయన పలు విషయాలపై చర్చించనున్నారు.