Sharmila Contests in AP : ఏపీలో రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. సౌత్ లో కర్నాటక, తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ఏపీలో సత్తా చాటాలని తహతహలాడుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం ఏపీ రాజకీయాలపై ఫోకస్ చేసింది. వైఎస్ షర్మిలకు ఏపీలో కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంతనాలు సాగిస్తోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిలను నియమించాలని భావిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచే షర్మిల పోటీ చేస్తారని తెలుస్తోంది. ఢిల్లీలో ఏపీకి సంబంధించిన చర్చలు నడుస్తున్నట్టు సమాచారం. త్వరలోనే కొత్త అధ్యక్ష బాధ్యతలు.. పొత్తుల పై ప్రకటన చేయనున్నారు.
వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులు కావడం దాదాపు ఖాయమైంది. కర్నాటక, తెలంగాణలో గెలుపు తర్వాత కాంగ్రెస్ దక్షిణాదిలో తమ బలాన్ని మరింత పెంచుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు ఏపీలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఫోకస్ చేసింది. అన్న చెప్పినా కాదని తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ ఏర్పాటు చేసిన షర్మిల.. చివరకు దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ప్రయత్నించారు. టీ కాంగ్ నేతల అభ్యంతరాలతో తన పార్టీని విలీనం చేయలేదు. కనీసం షర్మిలను ప్రచారం కూడా చేయనివ్వలేదు. అటు పోటీ చేయకుండా.. ఇటు కాంగ్రెస్ లో చేరకుండా సైలంట్ గా ఉండాల్సి వచ్చింది. అయితే ఏపీ రాజకీయాల్లో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించి షర్మిల సేవలను వాడుకోవాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు.
షర్మిల తాను తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవుతానని గతంలో స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకతోనూ సమావేశాలు నిర్వహించారు. వైఎస్ఆర్ పేరు సీబీఐ చార్జ్ షీటులో సమాచార లోపంతోనే జరిగిందంటూ షర్మిల చేసిన కామెంట్స్ రాజకీయంగా చర్చకు దారితీశాయి. ఆ సమయంలోనే షర్మిల తాను తెలంగాణకు పరిమితం అవుతానని చెప్పడం.. దానికి తెలంగాణ నేతలు అభ్యంతరం చెప్పడంతో.. షర్మిల విషయం ఏ నిర్ణయం తీసుకోలేదు. తాజాగా షర్మిలను ఏపీసీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు ఒప్పించినట్టు తెలుస్తోంది.
ఈ విషయంపై కాంగ్రెస్ పెద్దలు సోనియా, ఖర్గే, రాహుల్ చర్చించినట్టు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిగా నియమితులైన మాణిక్కం ఠాగూర్ కు కూడా ఈ విషయంలో సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈనెల 27న ఏపీలో పార్టీ వ్యవహారాలపై రాహుల్ కీలక మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ భేటీలో షర్మిల అంశంతో పాటు ఏపీలో పొత్తులు, రాష్ట్రంలో ప్రియాంక పర్యటనపై క్లారిటీ రానుంది. ఇక వచ్చే ఎన్నికల్లో షర్మిల పోటీ చేస్తారని సమాచారం. ఏపీలో తమ అన్న ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల ఎలాంటి పాత్ర పోషిస్తారో చూడాల్సిందే.