Sharmila In Congress :
తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా షర్మిల కీలకంగా మారారు. ఆమె అధికార పార్టీపై యుద్ధమే చేస్తున్నారు. గతంలో జగనన్న వదిలిన బాణం అంటూ ఆమె ఉమ్మడి రాష్ర్టంలో చేసిన పాదయాత్రకు మంచి మైలేజీ వచ్చింది. ప్రజల్లోకి ఆమె బలంగా వెళ్లింది. రాజన్న బిడ్డగా షర్మిల అంటే ఆమెపై చాలా కుటుంబాలకు ప్రత్యేక అభిమానం ఉంది. కానీ తెలంగాణలో సెంటిమెంట్ కేవలం ఈ ప్రాంతం వరకే పరిమితం. ఇది బలంగా నాటడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. తెలంగాణ సెంటిమెంట్ ముందు ఏది నిలబడదు.
అయితే ఇలాంటి సమయంలో రాజన్న భజన చేస్తూ ఇన్నాళ్లు షర్మిల తెలంగాణలో తిరుగుతున్నారు. అయితే తాజాగా ఆమె కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీని వెనుక జగన్ సలహాలు ఉన్నాయని చెబుతున్నారు. తెలంగాణ సెంటిమెంట్ ఒకవైపు.. రాజన్న భజన మరోవైపు నిలబెట్టి కేసీఆర్ ను ఇక్కడ మరోసారి గెలిపించుకోవడంలో భాగంగానే ఇదంతా జరగుతున్నదని టాక్ వినిపిస్తున్నది. అయితే షర్మిలను ఏపీకే పరిమితం చేయాలని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గం డిమాండ్ చేస్తున్నది. ఆమె అక్కడి కాంగ్రెస్ కు సేవలందించాలని వారంతా కోరుతున్నారు.
అయితే టీ కాంగ్రెస్ కు షర్మిలతో వచ్చే లాభమేమో కానీ ఆమె ఏపీ కి చెందిన నాయకురాలిగా ఇప్పటికే ముద్ర పడి ఉన్నారు. తెలంగాణ కోడలిగా చెప్పుకుంటున్నా ప్రజల్లోకి బలంగా వెళ్లలేదు. ఇప్పుడు కనుక కేసీఆర్ మరోసారి సెంటిమెంట్ అస్ర్తాన్ని వాడితే టీ కాంగ్రెస్ దెబ్బ పడే చాన్స్ ఉంది. ఏపీ వారితో తెలంగాణలో రాజకీయాలేంటి అనే ప్రశ్న బలంగా పుడుతుంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ అచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. అయితే జగనన్న వదిలిన బాణం కాస్తా.. ఆ జగనన్న పైకే ప్రయోగించాలనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ షర్మిల ముందుంచితే ఆమె ఎలా రియాక్ట్ అవుతారో వేచిచూడాలి. ఏదేమైనా తెలంగాణ రాజకీయాల్లో షర్మిల కీలకంగా మారుతున్నారనడానికి ఇదే నిదర్శనంగా కనిపిస్తున్నది.