Sitting MLA : రానున్న ఎన్నికల్లో సిట్టింగులకే టికెట్లు ఇస్తామని కేటీఆర్ స్పష్టంగా చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ టికెట్లు ఆశిస్తున్న పార్టీ కార్పొరేటర్లకు ఈ మేరకు ఆయన గట్టిగా చెప్పారు. వార్డు కార్యాలయాల ప్రారంభోత్సవంలో భాగంగా ఆయన కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సిట్టింగులతో పోటీవద్దని కలిసి పని చేసి పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు. అయితే ఆశావాహులకు కేటీఆర్ మాటలు బుజ్జగించినట్లే అనిపించినా ఆయన స్ర్టాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారని పలువురు చెబుతున్నారు. ఇప్పటికే టికెట్లు ఆశిస్తున్న వారి వివరాలు కేటీఆర్ వద్ద ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఇది తమకు ఇబ్బందిగా మారుతుందని కేటీఆర్ పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తున్నది.
అయితే గ్రేటర్ హైదరాబాద్ లో చాలా మంది కార్పొరేటర్లు ఏండ్ల తరబడి పార్టీకి సేవలందిస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా, అనుచరగణం పరంగా బలంగా ఉన్నవారు ఈ టికెట్లు ఆశిస్తున్నారు. అయితే కేటీఆర్ మాత్రం పార్టీ కోసం పనిచేసే వారికి ఏదో ఒక సమయంలో గుర్తింపు కచ్చితంగా దక్కుతుందని చెప్పారు. అంతేకాని పార్టీ కి నష్టం కలిగించేలా ప్రవర్తించవద్దని సుతిమెత్తంగా చెప్పారు. కొందరు కార్పొరేటర్లకు ఎమ్మెల్యేలతో ఉన్న విభేదాలు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. ప్రస్తుతం ఎన్నికల సమయమని అంతా కలిసి వెళ్తేనే ప్రత్యర్థులను ఢీకొట్టగలమని ఆయన చెప్పినట్లు సమాచారం.
ఇన్నాళ్లు టికెట్ల కోసం ఆశలు పెట్టుకున్న ఒకరిద్దరు కార్పొరేటర్లు మంత్రి కేటీఆర్ మాటలతో నొచ్చుకున్నట్లు సమాచారం. వారంతా నిరాశకు గురయ్యారని, పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నా, తమకు తగిన గౌరవం దక్కడం లేదని వారంతా అనుచరుల వద్ద బాధపడినట్లు సమాచారం. అయితే టికెట్లు మరోసారి సిట్టింగులకే అని పార్టీలో నంబర్ 2 అయిన కేటీఆర్ తేల్చేయడంతో ఇక ఒకరిద్దరు కార్పొరేటర్లు పక్క పార్టీల వైపు కూడా చూస్తున్నట్లు తెలిసింది. ఏదేమైనా ఈ ఎన్నికల సమయం బీఆర్ఎస్ కు పెద్ద పరీక్షాకాలమే.