Joe Biden అమెరికాలో ఉండే భారతీయులకు శాశ్వత నివాసం కల్పించేందుకు వచ్చే దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు కోరారు. ఈమేరకు రాజా కృష్ణమూర్తి, లేరీ బుక్ షాన్ సారథ్యంలోని 56 మంది శాసనకర్తలు బైడెన్ సర్కారును కోరారు. ప్రస్తుతం గ్రీన్ కార్డుల కోసం చాలా మంది భారతీయులు ఏండ్లుగా ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. అదే విధంగా జాబ్ వీసా మీద వచ్చే వారి విషయంలోనూ కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లి ఉపశమనం కలగించాలని కోరారు. అన్ని నిబంధనలు పాటిస్తూ చట్ట బద్దంగా అమెరికాకు రావాలని అనుకుంటున్న వారికి ఊరట ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో అలసత్వం వల్ల వీసాలు ఆలస్యమవుతున్నాయని, ఉద్యోగాలు మారాలనుకున్న వారికి, వ్యాపారాలు చేయాలనుకునేవారికి ఇబ్బందులు ఎధురవుతున్నాయని తెలిపారు.
అయితే దేశాల వారీగా కోటా అమలుతో నే ఇలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు స్పష్టం చేశారు. దీంతో ఏండ్ల పాటు గ్రీన్ కార్డు కోసం ఎదురు చూడాల్సి వస్తున్నదని తెలిపారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, భారతీయులకు గ్రీన్ కార్డుల విషయంలో చొరవ చూపాలని ఫౌండేషన్ ఫర్ ఇండియా, ఇండియన్ డయాస్పొరా స్టడీస్ కూడా వేర్వేరుగా బైడెన్ సర్కారుకు విన్నవించింది. గ్రీన్ కార్డు లేకపోడంతో, ఆయా సంస్థల యాజమాన్యాల కింద 10 లక్షల మంది ఒత్తిడి ఎదుర్కొవాల్సి వస్తున్నదని ఇమిగ్రేషన్ వాయిస్ అధ్యక్షుడు అమన్ కపూర్ పేర్కొన్నారు. అన్ని దేశాలకు ఏడు శాతం కోటా వలనే ఇబ్బంది ఎదురవుతున్నదని, వెంటనే భారతీయుల విషయంలో కొంత చొరవ చూపాలని వారు కోరారు.