Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర ఓ ఎక్స్ ప్రెస్ రైలును అరగంట నిలిపివేసింది. ఇది నిజం.. ఉత్తరప్రదేశ్ లో ఇటావా సమీపంలోని ఉడిమోర్ జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది. పాట్నా-కోటా మధ్య రాకపోకలు సాగించే ఎక్స్ ప్రెస్ రైలు మే 3న ఉడిమోర్ జంక్షన్ కు చేరుకుంది. అయితే, అక్కడున్న స్టేషన్ మాస్టర్ నిద్రలోకి జారుకోవడంతో గ్రీన్ సిగ్నల్ లేకపోవడంతో రైలును లోకోపైలట్ అక్కడే నిలిపివేశాడు. అనేక సార్లు హారన్ కొట్టినా ఫలితం లేకపోయింది. అరగంట తర్వాత మేల్కొన్న స్టేషన్ మాస్టర్ గ్రీన్ సిగ్నలు ఇచ్చాడు.
విధుల్లో నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన ఆగ్రా డివిజన్ రైల్వే అధికారులు వివరణ కోరారు. అనంతరం తగు క్రమ శిక్షణా చర్యలు తీసుకుంటామని ఆగ్రా రైల్వే డివిజన్ పీఆర్ వో ప్రశస్తి శ్రీవాస్తవ ఓ వార్తా సంస్థకు తెలిపారు. స్టేషన్ మాస్టర్ తన తప్పును అంగీకరించాడని, తప్పిదానికి క్షమాపణ చెప్పినట్లు తెలిసింది.