Tirumala Srivari Temple : కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడు. వడ్డీకాసులవాడు. వైకుంఠవాసుడి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఎన్నో కానుకలు అందజేస్తారు. వెంకటేశ్వరుడిని దర్శించుకోవడం పుణ్యంగా భావిస్తారు. ఏడుకొండల వాడిని చూసి జన్మ తరించాలని ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం ఎన్ని కష్టాలైనా భరిస్తారు. ఎంత సమయమైనా వేచి ఉండి దేవుడిని దర్శించుకోవడం సహజం.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆలయాలు, కల్యాణ మండపాలు నిర్మిస్తుంది. దీని కోసం పలు చోట్ల ఆలయాలు నిర్మిస్తోంది. ఇందులో భాగంగా నవీ ముంబయిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, రేమండ్ గ్రూప్ చైర్మన్, ఎండీ గౌతమ్ హరి సంఘానియా సమయంలో మంగళవారం ఒప్పందం కుదిరింది.
ముంబయిలోని ఉల్వే ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల స్థలంలో రూ.70 కోట్లతో శ్రీవారి ఆలయం నిర్మించేందుకు సంకల్పించారు. త్వరలో దీనికి సంబంధించిన పనులు ప్రారంభిస్తామని తెలిపారు. సీఈ నాగేశ్వర్ రావు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, డిప్యూటీ ఈవో సెల్వం పాల్గొన్నారు. దీంతో ఆలయ నిర్మాణ పనులు వేగంగా సాగనున్నాయి.
ముంబయిలో శ్రీవారి ఆలయం నిర్మిస్తే భక్తుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఇక్కడ భక్తి భావం ఎంతో ఉంటుంది. ఇందులో భాగంగానే ముంబయిలో ఆలయం నిర్మించడం వల్ల చాలా మందికి సులభంగా ఉంటుంది. శ్రీవారిని దర్శించుకోవడం వీలవుతుంది. వాణిజ్య కేంద్రంగా విరాజిల్లుతున్న ముంబయిలో సైతం శ్రీవారి ఆలయం ఉండాలనే ఉద్దేశంతోనే నిర్మించడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.