Unbearable Burden : దేశంలో ఏర్పడిన కొత్త రాష్ట్రం ‘తెలంగాణ’. సొంత రాష్ట్రం ఏర్పడి పదేళ్లు (2014) గడుస్తున్నా.. సామాన్యుడి కష్టాలు మాత్రం ఇప్పటికీ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉన్నాయి. మూడు ప్రధాన ఆకాంక్షలను నెరవేర్చేందుకు రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ వాదులు వాటికే దూరం అవుతున్నారంటే బాధ కలుగక మానదు. నీళ్లు, నిధులు, నియామకాలపైనే తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలు జరిగాయి. మలి దశ ఉద్యమం 2014 వరకు చివరి దశ 2014, జూన్ లో రాష్ట్రం ఏర్పాటు చేస్తూ పార్లమెంట్ లో బిల్లు పాసైంది.
ఇవన్నీ మనకు తెలిసిన గతమే. వర్తమానం మరింత బాగుంటుందని కలలు గన్న సదరు తెలంగాణ వాదికి ఇప్పటికీ కన్నీరే మిగిలింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఉద్యమ పార్టీగా పుట్టిన టీఆర్ఎస్ రాను రాను రాజకీయ రంగును పులుముకుంది. గులాబీ పార్టీగా గుర్తింపు పొంది 2014 ఎన్నికల పోరులో ఏకపక్షంగా విజయం సాధించింది. తర్వాత 2018లో కూడా భారీ మెజారిటీతోనే గెలిచినా ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని కేసీఆర్ అందరినీ టీఆర్ఎస్ లోకి లాగారు. ఇక ఆయన ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది.
ఉద్యమ కాలంలో అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు వేదికగా మారిన టీఆర్ఎస్ పార్టీ రాను రాను కేసీఆర్ ఇంటి పార్టీగా మారింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా, ఆయన కొడుకు కేటీఆర్ మంత్రిగా, ఆయన కూతురు కవిత ఎమ్మెల్సీగా, మేనల్లుడు హరీశ్ రావు మరో శాఖ మంత్రిగా, కొడుకు వరస అయ్యే సంతోష్ రావు ఎంపీగా ఇలా మొత్తం కుటుంబ సభ్యులతో పార్టీని నింపారు కేసీఆర్. 2018 తర్వాత పార్టీలో సీనియర్ నాయకులకు విలువ లేకుండా పోతుందన్న ఆరోపణలతో ఈటల రాజేందర్ బయటకు వచ్చాడు.
ఈ సమయంలోనే కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని కూడా కేసీఆర్ అనుకున్నట్లు వాదనలు వినిపించాయి. దీనిని ఈటల బాగా వ్యతిరేకించడంతో పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ప్రధాని మోడీ ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పారు. ఎన్నో కళలను సాకారం చేసుకున్న మన తెలంగాణలో ఇప్పటికీ నీళ్లు, నిధులు నియామకాలు లేకపోవడంతో సామాన్యుడు రోధిస్తున్నాడు.
చాలా కాలంగా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పాలనపై తెలంగాణలో వ్యతిరేకత కనిపిస్తుంది. ‘సాలు దొర సెలవు దొర’ అంటూ సోషల్ మీడియాలో వివిధ మీమ్స్, ట్రోల్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రతీ అంశంపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇందులో కొన్ని అంశాలను ప్రధానంగా పరిశీలిస్తే..
వ్యాట్ ఎందుకు తగ్గడం లేదు..
పెట్రోల్, డీజిల్ రేట్లు చమురు సంస్థలు విధించే హెచ్చు, తగ్గులపై ఆధారపడతాయి. కేంద్రం అయితే ఇందులో ప్రధానంగా రెండు ట్యాక్స్ లు ఉంటాయి. ఒకటి కేంద్రం విధిస్తే, రెండో రాష్ట్ర పరిధిలో ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు, అవసరాన్ని బట్టి కేంద్రం తమ పరిధిలోని పన్నును తగ్గించుకుంటూ వచ్చింది. కానీ రాష్ట్రం మాత్రం ఇప్పటి వరకు పన్నులను తగ్గించలేదు. గతంలో అస్సాం, ఇంకా కొన్ని రాష్ట్రాలు రాష్ట్ర పన్నులను తగ్గించి అక్కడి ప్రజలకు ప్రయాణ భారాన్ని తగ్గించారు. కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం పన్ను భారాన్ని తగ్గించలేదు సరికదా సమర్థించుకుంది కూడా.
ఇక కరెంట్ విషయంలో..
కేంద్రం నార్త, సౌత్ గ్రిడ్ లను కలుపి సర్ఫెస్ కరెంట్ ను అన్ని రాష్ట్రాలకు నిత్యం సరఫరా చేస్తుంది. నిరంతర విద్యుత్ నినాదం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీది. కానీ తెలంగాణ దొర (కేసీఆర్) రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ కేంద్రం ఇవ్వడం లేదని ఆరోపణలు చేస్తూ ఇక్కడ ఆటోమేటిక్ కాల్ డిస్ట్రిబ్యూటర్ (ACD) చార్జీలు వసూలు చేస్తూ సామాన్యుడిపై భారీ గా భారం మోపుతుంది. ఇక 24 గంటల ఉచిత విద్యుత్ ఎక్కడ ఉండడం లేదని రైతులు లబోదిబో మంటున్నారు.
పెరిగిన రిజిస్ట్రేషన్ ధరలు..
‘ధరణి’ రాక ముందు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులువుగా సజావుగా జరిగిపోయేది. ధరణి వచ్చిన తర్వాత అంతా గందరగోళంగా మారిందన్న వాదనలు ఉన్నాయి. ఒకరి భూమి పట్టా మరొకరి పేరుపై రావడం. కొందరు అధికారులను ప్రసన్నం చేసుకొని భూమిని కబ్జా చేయడం లాంటివి జరిగాయి. దీనికి తోడు రిజస్ట్రేషన్ ధరలు కూడా పిరమయ్యాయి.
ఇక నిత్యావసరాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వాటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నా దొర (కేసీఆర్) మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక వేళ దొర మేల్కొని పట్టించుకుంటే ‘దీనికి అంతటికీ కేంద్రమే కారణం’ అంటూ సారు సల్లగా చెప్పి తప్పించుకోవడం చూసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ ను గద్దె దించాలని సామాన్య తెలంగాణ వాది కోరుకుంటున్నాడనంలో అతిశయోక్తి లేదు.