YCP Hopes on Those Two : మరోసారి అధికారమే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు. ఇప్పటి నుంచి పార్టీ క్షేత్రస్థాయిలో ఉండేలా జగన్ తన ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇక ప్రతిపక్షాలకు ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వొద్దనే ఆలోచనతో వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఇందు కోసం రెండు ప్రధాన అస్త్రాలను నమ్ముకున్నారు. వాటితోనే ఎన్నికల కదనరంగంలోకి దిగుతున్నారు. నాలుగున్నారేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమం – సామాజిక న్యాయం ప్రజలకు వివరించేందుకు బస్సు యాత్ర చేపట్టారు. వై ఏపీ నీడ్స్ జగన్ పేరు తో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది.
రెండో రోజుకు బస్సుయాత్ర
వైసీపీ బస్సు యాత్ర రెండో రోజుకు చేరింది. ఇచ్ఛాపురం, తెనాలి, శింగనమలలో తొలి రోజు యాత్ర సాగింది. శుక్రవారం గజపతినగరం, నరసాపురం, తిరుపతిలో యాత్ర సాగుతుంది. తిరుపతిలో యాత్రతో పాటుగా సాయంత్రం జరిగే బహిరంగ సభలో ఎంపీ విజయసాయిరెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాల నాయకులు హాజరుకానున్నారు. గజపతినగరంలో మధ్యాహ్నం బహిరంగ సభ నిర్వహించనున్నారు. నరసాపురం మొగల్తూరు సెంటర్లో మధ్యాహ్నం 3 గంటలకు యాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం రామాలయం సెంటర్లో భారీ బహిరంగ సభ ఉంటుంది.
సంక్షేమమే ఓటు బ్యాంక్ : పార్టీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ఈ నాలుగేళ్లలో జరిగిన సామాజిక న్యాయాన్ని బస్సు యాత్రలో ఎలుగెత్తి చాటాలని, తద్వారా రాబోయే రోజుల్లో పెత్తందారులతో జరిగే యుద్ధంలో పేదవాడి విజయానికి బాటలు వేయాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కల్పించిన ప్రాధాన్యత ఈ రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశచరిత్రలోకూడా మునుపెన్నడూ చూడనిదని జగన్ పేర్కొన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ప్రగతిని హక్కుగా ప్రభుత్వం ప్రజలకు అందించిందని చెప్పారు. గత 53 నెలల కాలంలో రూ. 2.38 లక్షల కోట్ల డీబీటీలో 75శాతం ఆయా వర్గాలకు చేరడమే ఇందుకు నిదర్శనం అని సీఎం జగన్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
సామాజిక సమీకరణాలూ కౌంట్ : నాలుగున్నరేళ్ల కాలంలో 2.45 లక్షల కోట్ల మేర సంక్షేమ పథకాలు అందించినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జనవరి నుంచి పెన్షన్ ను రూ 3000కి పెంచనున్నారు. జనవరి నుంచి మార్చి నెలాఖరులోగా ప్రధాన పథకాల లబ్దిదారులకు భారీ మొత్తంగా చివరి విడత నిధులు అందించనున్నారు.
సామాజిక సమీకరణాలను ప్రభావితం చేసే విధంగా సామాజిక న్యాయం అమలు దిశగా అభ్యర్దుల ఎంపిక పైనా కసరత్తు చేస్తున్నారు. ఈ రెండు అస్త్రాల ద్వారా ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయాలనేది జగన్ వ్యూహం. మరి..ప్రతిపక్షాలు ఈ సంక్షేమ ఓట్ల యుద్ధంలో ఎలాంటి పోటీ ఇస్తాయి..ప్రజల తీర్పు ఎలా ఉంటుందనేది ముందు ముందు తేలనుంది.