YCP comments on Chandrababu Death : ఏపీలో వైసీపీ నేతల తీరు హద్దు దాటుతున్నది. ఇన్నాళ్లూ ఒకరిద్దరు మంత్రలు వ్యాఖ్యలు పార్టీకి చేటు చేస్తుండగా, ఇప్పుడు మరో ఎంపీ కూడా జత కలిశారు. ఆయన గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలతో తన పరువు పోగొట్టుకన్నారు. ఇప్పుడు కూడా అదే రీతిలో మాట్లాడారు.
ఏపీలో వైసీపీ అధికారంలో కి వచ్చాక ప్రతిపక్షాలే లేకుండా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నది. ఆ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ అనేక కేసులు, హింసతో బెదిరింపులకు దిగుతున్నది. ఇక ఎన్నికల సమయం దగ్గర పడగానే టీడీపీ అధినేత చంద్రబాబుపై అభియోగాలు మోపుతూ అనేక కేసులు నమోదు చేసింది. ఆయన కుటుంబాన్ని కూడా వేధిస్తున్నది. ఇన్నర్ రింగ్ రోడ్డు, స్కిల్ స్కాం, ఫైబర్ నెట్, అంగళ్లు అలర్లు అంటూ వివిధ కేసులతో ఆయనను అరెస్ట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నది. ఇప్పటికే ఆయన స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ చేయగా, 49 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఇక ఆయనపై మంత్రులు కొడాలినాని, అంబటి రాంబాబు, రోజా మాటలు హద్దులు దాటుతున్నాయి. ఒక సీనియర్ రాజకీయ నాయకుడు అనే కనీస మర్యాద లేకుండా నోటికి వచ్చినట్లు తిడుతున్నారు. ఏకంగా స్పీకర్ స్థాయిలో ఉన్న తమ్మినేని సీతారాం కూడా ఎన్ఎస్ జీ సెక్యూరిటీ లేకుంటే చంద్రబాబు ఖతం అంటూ గతంలో వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆ పార్టీ నాయకుడు బోరుగడ్డ అనిల్ కుమార్ కూడా చంద్రబాబును ఆకురౌడీలతో చంపేస్తామంటూ ప్రకటన చేశారు. తాజాగా బస్సు యాత్రలో ఆ పార్టీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా నోరుజారారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు చావడం ఖాయమంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడివి సంచలనమయ్యాయి. చంద్రబాబు ప్రాణానికి పెనుముప్పు ఉందని వైసీపీ నేతలు చేస్తున్న ప్రకనలతోనే స్పష్టత వస్తోందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. పోలీసుల సాయంతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని అభిప్రాయం వినిపిస్తున్నది.