Jagan ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ర్టానికి అప్పులు పెరిగిపోయాయని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలకు బటన్ నొక్కుడు పేరిట ఆయన అప్పులు తెచ్చి రాష్ర్టాన్ని దివాళా స్థితికి తీసుకెళ్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతుంటాయి. రాష్ర్టంలో సంపద సృష్టి లేదని, పరిశ్రమల రాక మొత్తం మొదలైందని, ఏపీని మరో శ్రీలంక చేస్తున్నారని మండిపడుతున్నాయి. ఏపీ అప్పులపై కేంద్రం కూడా గతంలో పలుమార్లు హెచ్చరించింది. అయితే ఈ సొమ్మంతా వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్తుందని ఆరోపణలు వినిపిస్తుంటాయి.
తాజాగా జైస్వరాజ్య్ టీవీలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ ఏపీని జగన్ దివాళా స్థితికి తెచ్చాడని మండిపడ్డారు. గతంలో కంటే ఎక్కువ పథకాలు ఏం లేవని కానీ అప్పలు ఇంతలా ఎందుకు అయ్యాయో తెలియడం లేదని చెప్పుకొచ్చారు. ఈ బటన్ నొక్కడం ఏంటో తనకు అర్థం కాలేదని వ్యంగ్యంగా మాట్లాడారు. జగన్ పథకాలతో ఇప్పటివరకు లాభపడ్డదెవరో కూడా తెలియట్లేదని చెప్పారు. రాష్ర్టంలో ఏవర్గం కూడా సంతోషంగా లేరని, రానున్న ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అయితే ఏపీ సీఎం జగన్ పై రఘురామ తరచూ ఇలాంటి కామెంట్లు చేస్తూనే ఉంటారు. జగన్ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, ఒక్క చాన్స్ అంటూ ప్రజలకు అప్పుల కుప్ప పెట్టారని మండిపడ్డారు.
ఏపీలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం తెస్తున్న అప్పులు ఇప్పుడు ప్రమాదకరస్థాయికి చేరుకున్నాయి. బటన్ నొక్కుతున్నా అంటూ పథకాలు అమలు చేస్తున్నా, అభివృద్ధి విషయంలో ఇదే శ్రద్ధ పెడితే బాగుండని వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో ప్రస్తుతం రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారాయి. కేవలం సంక్షేమ పథకాలకే ఉన్న నిధులన్నీ సరిపోతున్నాయి. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. అభివృద్ధి పనులు పడకేశాయి. పోలవరం పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ఇలాంటి సందర్భంగా రఘురామ విమర్శలు కరక్టేనని అంతా చర్చించుకుంటున్నారు.