భారత్ రాష్ట్ర సమితి ఎట్టకేలకు తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని , మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును BRS నుండి సస్పెండ్ చేసింది. గతకొంత కాలంగా ఈ ఇద్దరూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది భారత్ రాష్ట్ర సమితి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలాకాలంగా కేసీఆర్ , కేటీఆర్ వ్యవహార శైలి పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. ఇటీవల కాలంలో ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమ్మేళనం పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఆ కార్యక్రమాల పట్ల గులాబీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మహబూబ్ నగర్ జిల్లా లోని కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి మంత్రిగా కూడా పనిచేశాడు జూపల్లి కృష్ణారావు. అయితే 2018 లో జరిగిన ఎన్నికల్లో జూపల్లి ఓడిపోయాడు. ఇక అప్పటి నుండి జూపల్లి కృష్ణారావును దూరం పెట్టింది అధిష్టానం. దాంతో అప్పటి నుండి జూపల్లి అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఇక నిన్న ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కాగా ఆ వేడుకలో అటు జూపల్లి ఇటు పొంగులేటి ఇద్దరు కూడా కేసీఆర్ మీద తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. దాంతో ఇక ఉపేక్షించి లాభం లేదని ఈరోజు ఇద్దరిని కూడా సస్పెండ్ చేసింది భారత్ రాష్ట్ర సమితి.