తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒక పార్టీ మరో పార్టీపై ఆరోపణలు చేస్తున్నాయి. మాటల యుద్ధం కాస్త భౌతిక దాడులకు దారి తీస్తోంది. సహనం కోల్పో యిన నేతలు ప్రత్యర్థుల చొక్కా పట్టుకునే వరకు వెళ్తోంది. ఈనేపథ్యంలో మాటల తూటాలు దాడులకు కారణమవుతున్నాయి. రాజకీయాలు హుందాగా ఉండాల్సిన అవసరం ఉన్నా వ్యక్తిగత ద్వేషాలతో గొడవలకు దారి తీస్తున్నాయి.
తాజాగా కుత్బుల్లాపూర్ లో ఓ టీవీ చానల్ నిర్వహించిన బహిరంగ చర్చలో మాటల యుద్ధం పెరిగింది. సహనం కోల్పోయిన నేతలు ఘర్షణకు పాల్పడ్డారు. దీంతో ఇద్దరు నేతల మధ్య వైరం పెరిగింది. స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీజేపీ అభ్యర్థి శ్రీశైలం గౌడ్ పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ గొంతు పట్టుకున్నారు.
అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇద్దరిని నిలువరించారు. రాగద్వేషాలతో గొడవ వరకు వెళ్లిన తీరుపై చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోతూ ఇతరులపై దాడులకు పాల్పడుతున్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ బాడీగార్డ్ ను చెంప మీద కొట్టాడు.
మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ ఎమ్మెల్యేపై దాడి చేయడం తెలిసిందే. ఇలా బీఆర్ఎస్ నేతలు ఘర్షణలకు దారి తీసే సందర్భంలో సహనం కోల్పోయి దాడులకు పాల్పడటం ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాప్రతినిధులై ఉండి సహనం వహించకుండా దాడులకు తెగబడటంపై విమర్శలు వస్తున్నాయి. ఇది అధికార పార్టీకి చెంపపెట్టుగానే అభివర్ణిస్తున్నారు.