Naveen Patnaik : రాజకీయాల్లో గెలుపోటముు సహజం. ఇవాల ఒకరు గెలిస్తే.. మరోసారి ఇంకొకరు.. ఓడినవారు స్పోర్టివ్ గా తీసుకోవాలి అనే మాటలు అప్పుడప్పుడు వింటుంటాం. ఈ మాటను అక్షరాల నిజం చేశారు ఓడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్. మృధుస్వభావి అయిన ఆయన నిన్న (మంగళవారం) సభలో తన ఉన్నత వ్యక్తిత్వాన్ని చాటుకొని, సభ్యలు, ప్రజల మన్ననలందుకున్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాల (గంజాం జిల్లా హింజలి, బొలంగీర్ జిల్లా కంటాబంజి) నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కంటాబంజిలో బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ బాగ్ చేతిలో ఓడిపోయారు. హింజలిలో గెలిచిన ఆయన మంగళవారం ప్రమాణస్వీకారం కోసం అసెంబ్లీకి వచ్చారు. అనంతరం అందరినీ పలకరించేందుకు వెళ్తుండగా అప్పటికే సభలో కూర్చొన్న లక్ష్మణ్ బాగ్ నవీన్ పట్నాయక్ ను చూసి లేచి నమస్కరించి పరిచయం చేసుకున్నారు. నవీన్ పట్నాయక్ వెంటనే ‘ఓహో.. మీరేనా నన్ను ఓడించింది. మీకు అభినందనలు’ అని అన్నారు. దీంతో అక్కడున్న సీఎం మోహన్ మాఝి, మంత్రులు, ఎమ్మెల్యేలు చిరునవ్వులు చిందించారు. ఓడించిన అభ్యర్థిని మనస్ఫూర్తిగా అభినందించిన ఆయన తీరుకు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మాజీ సీఎంను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇలాంటి ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం అన్నిచోట్లా ఉండాలని కామెంట్లు పెడుతున్నారు.