కర్ణాటకలో కాంగ్రెస్ భారీ విజయం నమోదు చేసుకుంది. ఇక సీఎం పీఠం కోసం ఇద్దరునేతల మధ్య వార్ కొనసాగుతుంది. సీఎం పదవి మా నాయకుడికే దక్కాలని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ వర్గం, మా నాయకుడికే దక్కాలని సిద్ధరామయ్య వర్గం హోరాహోరీగా ఫ్లెక్సీలు పెట్టి వార్ కొనసాగిస్తున్నారు. శనివారం ఫలితాలు రావడంతో జోష్ లో ఉన్న నేతలు ఇక ఆదివారం సీఎం పీఠం కోసం కొట్టుకోవడం మొదలు పెట్టారు. మా నాయకుడికే సీఎం పదవి దక్కాలి అని ఒకరంటే లేదు మా నాయకుడికే దక్కాలని మరో వర్గం డిమాండ్ చేస్తుంది.
కర్ణాటకలో భారత్ జోడో యాత్రకు ముందు డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య తీవ్ర విభేదాలు ఉండేవి. అయితే సునీల్ కనుగోలు చూసన మేరకు భారత్ జోడో యాత్రలో ఇద్దరు నాయకులు కలిసి రాహుల్ తో కలిసి నడిచారు. ఇక పై పార్టీని ప్రభుత్వంలోకి తెస్తామని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే ఇద్దరూ పని చేశారు. కన్నడ నాట కాంగ్రెస్ కు బ్రహ్మాండమైన మెజార్టీ తెచ్చారు. ఇక ఇప్పుడు సీఎం పీఠం కోసం ఇరు వర్గాల నాయకులు వాదులాడుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు బహిర్గతం కావడంతో సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర మాట్లాడుతూ మా నాన్నకు సీఎం పదవి ఇవ్వాలని, ఆయనకు సుధీర్ఘ అనుభవం ఉందన్నారు. ఈ పోస్ట్ కు తన తండ్రి అర్హుడని ఆయన అన్నారు. మరో వైపు డీకే శివ కుమార్ సోదరుడు సురేశ్ మాట్లాడుతూ తన సోదరుడిని ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రం సంతోషిస్తుందని అన్నారు. ఆదివారం (మే 14) సాయంత్రం 5.30 గంటలకు సీఎల్పీ భేటి కానుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలంతా బెంగళూర్ కు రావాలని పార్టీ హైకమాండ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
‘కనకపుర బండ’గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే డీకే శివ కుమార్ కేపీసీసీ అధ్యక్షుడు. పార్టీకి జవసత్వాలు నింపారు. ట్రాబుల్ షూటర్ గా కూడా గుర్తింపు దక్కించుకున్నారు. 2017 వరకు సాధారణ పార్టీ కార్యకర్తగా కొనసాగారు ఆయన. అదే సంవత్సరం ఆగస్ట్ లో గుజరాత్ కు చెందిన అహ్మద్ పటేల్ రాజ్యసభ సభ్యుడిగా గెలిచేందుకు అవసరమైన ఎమ్మెల్యేలకు బెంగళూర్ లో వసతి ఏర్పాటు చేసి అధిష్ఠానం దృష్టిలోపడ్డారు ఆయన. ఆ తర్వాత కేపీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
ఇక రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు ఉన్న నేతల్లో ఒకరు సిద్ధరామయ్య. దేవరాజ్ అరుసు తర్వాత కర్ణాటకకు ఐదేళ్లు ఆయనే ముఖ్యమంత్రిగా పని చేశారు. అహింద సముదాయానిక ప్రతినిధిగా ఉండేందుకు ఇష్టపడే సిద్ధరామయ్య జనతా పరివార్నుంచి 2006లో కాంగ్రెస్ లోకి వచ్చారు. జనతాదళ్ లోనూ ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా పని చేసిన సిద్ధరామయ్య ఇప్పటి వరకూ అత్యధిక సార్లు (13) బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా గుర్తింపు దక్కించుకున్నారు. 2013లో కాంగ్రెస్ 122 స్థానాల్లో గెలుపొందడం వెనుక ఆయన హస్తం ఉంది. దీన్ని గుర్తించిన హస్తం అధిష్ఠానం ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. సిద్ధ రామయ్యకు అపార అనుభవం ఉంది. పార్టీని ఒక్క చేత్తో నడిపే సత్తా ఆయనకు ఉంది.