Andhra Train Accident 2023 : విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. గమ్యస్థానం చేరుకునే లోపే భారీ శబ్దం సంభవించింది. ఏం జరిగిందో అర్థం కాలేదు. తెల్లవారుజామున కావడంతో అంతా నిద్రలోనే ఉన్నారు. కళ్లు తెరచి చూస్తే హాహాకారాలు, ఆర్తనాదాలు, చుట్టు కారుచీకట్లు, రక్తమోడుతున్న తీరు చూసి అందరు నిర్ఘాంతపోయారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో రైల్వే ప్రాంగణం కల్లోలంగా మారింది. ఏం జరిగిందో అని తెలుసుకునే లోపే నష్టం జరిగిపోయింది. పదుల సంఖ్యలో క్షతగాత్రుల అరుపులు మిన్నంటాయి.
బాధితుల్లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారే అధికంగా ఉన్నారు. ఆ సమయంలో రెండు రైళ్లలో 1400 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సెల్ ఫోన్ల లైట్ల సాయంతో కొంత మందిని రక్షించారు. పక్కనున్న ట్రాక్ పైకి గార్డు పెట్టె వెళ్లడంతో దెబ్బతింది. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఒక్కొక్కరిని రక్షిస్తున్నారు.
రైలు ప్రమాదంలో చనిపోయిన వారితో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ప్రాంగణం నిండిపోయింది. తమ బంధువుల కోసం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన వారు వెతుకులాట ప్రారంభించారు. క్షతగాత్రులకు అవసరమైన చికిత్సలు అందిస్తున్నారు. ఆస్పత్రి ప్రిన్సిపల్ పద్మలీల, సూపరింటెండెంట్ ఆనంద్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపడుతున్నారు.
రెడ్ క్రాస్, ఎస్ఎఫ్ఐ, విజయనగరం యూత్ ఫౌండేషన్, విద్యార్థి సంఘాలు రక్తదానం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎన్జీఆర్ఎఫ్ బలగాలు, జిల్లా యంత్రాంగం, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. దాదాపు 32 మంది గాయపడ్డారు. అందులో నలుగురి పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు చెబుతున్నారు. అందరు ఏపీకి చెందిన వారే ఉన్నారు.
సంఘటన స్థలాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ రామ్మోహన్ నాయుడు, కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపికా ఎం పాటిల్, ఆర్డీవో సూర్యకళ, ఎస్ కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గణబాబు, టీడీపీ నాయకులు గండి బాబ్జీ, కోళ్ల లలిత కుమారి, కిమిడి నాగార్జున, జనసేన నాయకురాలు యశస్వి తదితరులు సందర్శించి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.
పలాస, రాయగడ బోగీలు రెండుగా విడిపోయాయి. ప్రమాద తీవ్రతకు నుజ్జునుజ్జయ్యాయి. చనిపోయిన వారి దేహాలను గోనె సంచులలో చుట్టి ట్రాలీల్లో తరలించారు. గార్డు పెట్టెలో రెండు శవాలు ఉన్నట్లు కనుగొన్నారు. పునరుద్ధరణ పనుల కోసం మరో రైలును తీసుకొచ్చారు. వాల్తేరు డివిజన్ పరిధిలోని హావ్ డా- చెన్నై మెయిన్ లైన్ లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.