Rain Alert : తెలుగు రాష్ర్టాల ప్రజలకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా ఎండల నుంచి ఇక ఉపశమనం లభించనట్లేనని సమాచారం. ఇన్నాళ్లూ ఇగో.. అగో అంటూ వస్తున్న నైరుతి రుతుపవనాల్లో ఇక కదలిక వచ్చింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో విస్తరించిన రుతుపవనాల ప్రభావంతో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. రాయలసీమ, దక్షిణాంధ్రలోని మరికొన్ని ప్రాంతాలకు, నెల్లూరు జిల్లా కావలి వరకు ఈ రుతుపవనాలు విస్తరించినట్లుగా తెలుస్తున్నది. అయితే ఇక రానున్న 48 గంటల్లో అక్కడక్కడ భారీ, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతున్నది. అయితే అత్యధికంగా విజయవాడలో 66.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
పలకరించిన వాన..పులకరించిన జనం
ఎట్టకేలకు వరుణ దేవుడు కరుణించాడు. ఏపీలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడింది. కొన్ని రోజులుగా ఉక్కపోత, వడగాడ్పులతో అల్లాడుతున్న జనానికి కాస్త ఊరట లభించింది. సాయంత్రం 6 గంటల వరకు విజయవాడలో 66.5, మంగళగిరి, కొండపిలో 64, ఎ.కొండూరులో 58.5, కొల్లిపరలో 49.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ వారంలోనే నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 23న ఒడిశాకు ఆనుకొని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని, మరుసటి రోజుకు అల్పపీడనంగా బలపడుతుందని చెప్పారు.. తరువాత ఒడిశా, ఛత్తీ్స్ గఢ్, మధ్యప్రదేశ్ మీదుగా రాజస్థాన్ వైపు వెళ్తుందని తెలిపారు. దీంతో రుతు పవనాలు మరింత వేగంగా కదులుతాయని చెప్పారు. అలాగే రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం. ఇదే సమయంలో గంటకు 30 నుంచి 40 కి. మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.