Kcr spend 1000 crores : అత్త సొమ్ము అల్లుడి దానం సామెత గుర్తుండే ఉంటుంది. ప్రజల పైసను పార్టీ ప్రచారానికి ఉపయోగించే పనిలో ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ నిమగ్నమయ్యారు. ఎన్నికలకు కొన్ని నెలలే ఉండడంతో హ్యాట్రిక్ కోసం సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ఈ సారి ఎలాగైనా మళ్లీ బీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వంలోకి తేవాలని దృఢ నిశ్చయంతో పని చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ (ఐ అండ్ పీఆర్) శాకు కేటాయించిన రూ. 1000 కోట్లను పథకాల ప్రచారంతో పాటు తన పార్టీ ప్రచారానికి కూడా ఉపయోగించుకోవాలని లెక్కలు వేస్తున్నారు కేసీఆర్. ప్రభుత్వ పథకాల ప్రచారం ప్రజల్లోకి వెళ్తే అది బీఆర్ఎస్ పార్టీకే లాభం చేకూర్చుతుందని సీఎం వాటి కోసం ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది.
సంబంధిత శాఖ అధికారులతో సీఎం ఈ మధ్య తరుచుగా సమావేశమవుతున్నారు. ప్రభుత్వ పథకాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఐ అండ్ పీఆర్ శాఖ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ప్రకటనల కోసం మంచి టీమ్ ను తీసుకోవాలని దాదాపు వెయ్యి కోట్ల మేర ఖర్చు చేస్తున్నాం కాబట్టి తదనుగుణంగా యాడ్స్ ఉండాలని సూచించారు. ప్రభుత్వ పథకాలతో పాటు పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా యాడ్స్ డిజైన్ చేయాలని అందుకు ఏం చేస్తే బాగుంటుందని సూచనలు సలహాలు ఇచ్చారని సమాచారం.
ఎన్నికల షెడ్యూల్ వస్తే కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ప్రభుత్వ పథకాలను పార్టీ తరుఫున చేయడం వీలుకాదు. కాబట్టి ఆ లోపు అన్నీ చక్కబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. దాదాపు అక్టోబర్ వరకే రూ. 1000 కోట్లు ఖర్చు పెట్టాలని యోచిస్తున్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాల్లో కూడా ప్రచారం కోసం ఈ డబ్బును వినియోగించాలని తెలుస్తోంది. తమ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలపై పెద్ద పెద్ద హోర్డింగ్ లు, త్రీ వీలర్ (ఆటో), బస్సులు, థియేటర్స్, మీడియా, సోషల్ మీడియాలో వివిధ ప్రకటనలు ఎలా వేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. గతంలో ఐ అండ్ పీఆర్ శాఖకు పూర్తి స్థాయి కమిషనర్ లేడు. ఐఏఎస్ గా ప్రమోషన్ పొందిన అశోక్ రెడ్డి ప్రస్తుతం శాఖ కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు.