YCP Rebel MP RRR : ఏపీలో కొంతకాలంగా పార్టీ అధిష్టానంతో విభేదిస్తు్న్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం ఆయనపై కేసులు పెట్టి వేధించింది కూడా. ఇక ఇఫ్పుడు ఆయన జగన్ పై నేరుగా ఫైట్ చేస్తున్నారు. సుప్రీం, హైకోర్టులలో పిటిషన్లు వేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు. తాను 2024 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచే పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.
2024లో జరిగే ఎన్నికల్లో ఏ పార్టీ తరపున, ఏ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారనేది రఘురామకృష్ణరాజు క్లారిటీ ఇచ్చారు. ఈ సారి కూడా తాను ఎంపీగానే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. నరసాపురం లోక్ సభ స్థానం నుంచి టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పై ఆయన విమర్శలు గుప్పించారు. జగన్ ప్రభుత్వం ప్రజలను, ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకుందని చెప్పారు. అధికారం ఉంది కదా అని ఆగడాలు పెట్రేగిపోయాయని మండిపడ్డారు.
ఇక రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకానికి జగన్ ఆయన పేరునో, తండ్రి పేరునో పెట్టుకుంటున్నారని విమర్శించారు. పీఎం కిసాన్ పథకానికి కూడా వైఎస్సార్ రైతు భరోసా అని పేరు పెట్టారని మండిపడ్డారు. వైఎస్సార్ రైతు భరోసా పేరును తాటికాయంత అక్షరాలతో రాసి.. పీఎం కిసాన్ పేరును కనిపించీ కనిపించనట్టు ముద్రిస్తున్నారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మారుస్తున్నట్టు తెలుసుకున్న కేంద్రం, రూ. 5,300 కోట్లను నిలిపివేసినట్టు తెలిసిందని రఘురాజు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఓవైపు ప్రధాని ఫొటో, మరోవైపు సీఎం ఫొటో వేసుకుంటే అభ్యంతరం లేదని, అలా కాకుండా ఏదో సొంత జేబులో నుంచి డబ్బు తీసి ఇస్తున్నట్టు ఆయన ఫొటో, తండ్రి ఫొటో పెట్టుకోవడం విడ్దూరంగా ఉందని ఎద్దేవా చేశారు.