తాగిన మైకంలో ఆ మానవమృగం ఏం చేస్తుందో తెలియదు. అభం, శుభం తెలియని చిన్నారులను ఎత్తుకెళ్లి వారితో లైంగిక వాంఛ తీర్చుకొని ప్రాణాలు తీసేవాడు. ఈ దుర్మార్గుడు దాదాపు 30 మంది చిన్నారులను చంపి ఉంటాడు. మత్తులో ఈ మానవ మృగం ఇంత అమానుషానికి పాల్పడగా కోర్టు సదరు వ్యక్తిని నేరస్తుడిగా తేల్చింది. త్వరలో శిక్ష ఖరారు చేయనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర ప్రదేశ్ లోని కాస్గంజ్ కు చెందిన రవీంద్ర కుమార్ కుటుంబం తనకు 18 వ ఏట 2008లో ఢిల్లీకి వలస వచ్చింది. అతడి తండ్రి ప్లంబర్ గా, తల్లి ఇళ్లలో పాచి పని చేసేది. ఢిల్లీకి వచ్చిన కొన్ని రోజులకు రవీంద్ర కుమార్ విపరీతంగా డ్రగ్స్ కు బానిసయ్యాడు. వీటితో పాటు విపరీతంగా పోర్న్ కూడా చూసేవాడు. వృత్తి రీత్యా కూలి చేసేవాడు. డ్రగ్స్ తో పాటు పోర్న్ వీడియోలకు బానిసైన రవీంద్ర కుమార్ రాత్రి 8 గంటలకే నిద్రపోయేవాడు. అర్థరాత్రి లేచి చిన్న పిల్లల కోసం నిర్మానుష్య ప్రదేశాలు, మురికివాడలు, గల్లీల్లో తిరుగుతుండేవాడు.
చిన్న పిల్లలు కనిపించకుంటే దాదాపు 40 కిలో మీటర్ల దూరం కూడా నడుచుకుంటూ వెళ్లేవాడు. నిద్రపోతున్న వారిని, కనిపించిన చిన్నారులను మభ్యపెట్టి జన సంచారం లేని ప్రదేశాలకు తీసుకెళ్లేవాడు. తర్వాత వారిపై లైంగికదాడి చేసి హతమార్చేవాడు. ఇలా 2008 నుంచి 2015 వరకు దాదాపు 7 సంవత్సరాల్లో 30 మంది చిన్నారుల ఉసురుతీశాడు. వీడు హతమార్చిన వారిలో 6 నుంచి 12 సంవత్సరాల వయస్సు ఉన్నవారే ఎక్కువ.
పోలీసులకు ఆధారాలు చిక్క కుండా వేర్వేరు ప్రదేశాలలో ఈ అఘాయిత్యాలకు పాల్పడేవాడు. అయితే 2014లో ఆరు సంవత్సరాల చిన్నారిపై లైంగికదాడి చేసి సమీపంలోని సెప్టిక్ ట్యాంక్ లో పడవేసిన ఘటనలో రవీంద్ర కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన చేసిన హత్యలు, ఆయన సంచరించిన ప్రదేశాల గురించి కూపీ లాగగా 30 హత్యలు చేసినట్లు నిరూపితమైంది. ఈ కేసులపై విచారణ చేపట్టిన ఢిల్లీ కోర్టు మంగళవారం (మే 9)న దోషిగా తేల్చింది. నేరస్తుడికి రెండు వారాల్లో శిక్షను ఖరారు చేయనున్నారు.