Big Fraud in Bihar : జనాలు ఆన్ లైన్ కు బాగా అలవాటు పడిపోయారు. సెల్ ఫోన్ల వాడకం, ఇంటర్నెట్ వినియోగం, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం..ఇవన్నీ కామన్ అయిపోయాయి. జనాలు లైవ్ కన్నా ఆన్ లైన్ లోనే ఎక్కువగా ఉంటున్నారు. చేతిలో సెల్ లేకుండా ఒక్క క్షణం గడవట్లేదు. ఇక కంపెనీల ఉత్పత్తుల ప్రచారం, అమ్మకాలు..ఇలా ప్రతీది ఆన్ లైన్ లోనే సాగుతోంది. అయితే మోసాలు కూడా అదే రేంజ్ లో జరుగుతున్నాయి. కొత్త రకపు మోసాలతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. ఆన్ లైన్ మోసాలతో ఎంతోమంది ఆస్తులు పోగొట్టుకోవడమే కాక ఆర్థిక ఇబ్బందులు, అవమాన భారంతో ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు.
ఆన్ లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెపుతున్నా ఉన్నత విద్యావంతులు సైతం మోసపోతున్నారు. ఇక అంతంత మాత్రం చదివిన వారు.. నిరక్షరాస్యుల పరిస్థితి చెప్పనలవికాదు. వింత వింత మోసాలతో నేరగాళ్లు ముందుకొస్తున్నారు. ఎవరూ ఊహించని కాన్సెప్ట్ లతో, ముఖ్యంగా యూత్ ను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
బిహార్ లో ఓ వింతైన మోసం బయటపడింది. ‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్’ నుంచి యువకులకు జాబ్ ఆఫర్ మెసేజ్ లు వెళ్లాయి. రూ.799 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే కంపెనీ అమ్మాయిల ఫొటోలు పంపిస్తుంది. నచ్చిన అమ్మాయిని ఎంచుకుని గర్భవతిని చేయడమే ఉద్యోగం. అలా చేస్తే రూ.13లక్షలు చెల్లిస్తుంది. ఒకవేళ గర్భవతిని చేయలేకపోతే ప్రోత్సాహకమూ రూ.5లక్షలు ఇస్తారు. ఈ ఫ్రాడింగ్ కేసులో 8 మందిని అరెస్ట్ చేశారు. అయితే వందలాది మంది యువకులు మోసపోయినట్టు చెపుతున్నారు.
నేరగాళ్లు ఇలాంటి వినూత్న పొకడలతో మోసాలకు బరితెగిస్తున్నారని, అలాంటి వాటి జోలికి వెళ్లొద్దని చెబుతున్నా.. మళ్లీ మళ్లీ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక యూపీ, బిహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీగా నమోదవుతున్నాయి. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలంటే ప్రజలను చైతన్యవంతులను చేయడంతో పాటు నేరగాళ్లను కఠినంగా శిక్షించాలి. అప్పుడే ఇలాంటి నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి.