Aadhar card : ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, ఇతర వివరాలు మార్చుకోవాలంటే చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆధార్ కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరగడంతోపాటు డబ్బులు కూడా చెల్లించాలి. అయితే, ఆధార్ కార్డు ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశాన్ని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కల్పిస్తోంది. ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు దాటి, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అప్డేట్ చేయని వాళ్ళు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది డిసెంబర్ 14 వరకు ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు.
గడువు తరువాత అప్డేట్ చేసుకోవాలి అంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ కనీసం 10 ఏళ్లకు ఒకసారి గుర్తింపు కార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కేంద్ర గుర్తింపు సమాచార నిధి లో వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల ప్రతి ఒక్కరి సమాచారం సిఐడిఆర్ వద్ద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుందని, ఇది కచ్చిత సమాచారం నిక్షిప్తం అవ్వడానికి దోహదం చేస్తుందని కేంద్రం చెబుతోంది.
ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు తమ డెమోగ్రాఫిక్ వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం వుడాయ్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి లేటెస్ట్ గుర్తింపు కార్డు, అడ్రస్ వివరాలు సబ్మిట్ చేయాలి. ఓటర్ ఐడి, కిసాన్ ఫోటో పాసుబుక్, పాస్పోర్ట్ వంటి గుర్తింపు, చిరునామా రెండింటికి ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు. ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన స్కాన్డ్ కాపీలను మై ఆధార్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.