Yanam : తాను ప్రాణంగా ప్రేమించిన యువకుడు గంజాయికి బానిసై క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తనను మరిచిపోలేక.. తాను లేని లోకంలో ఉండలేక ఇక ప్రియురాలు కూడా తనువు తీసుకుంది. ప్రముఖ పర్యాటక కేంద్రంలో యానాంలో జరిగిన ఈ ఘటన విషాదం నింపింది. ప్రేమ కోసం ఇలా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. ప్రాణం కంటే ఇష్టంగా ప్రేమించిన వ్యక్తి తన కళ్ల ముందు ఇక కనిపించడని తెలిసి కొందరు ఆయువు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. ఇలాంటి ఘటనే యానాంలో జరిగింది.
యానాంలోని యూకేవీనగర్ కి చెందిన మీసాల మౌనికకు ఒక అక్క, చెల్లి ఉన్నారు. వీరి తల్లిదండ్రులు పదేళ్ల క్రితం చనిపోయారు. మౌనిక తాళ్లరేవు మండలం చొల్లంగిలోని రాయల్ కాలేజీలో నర్సింగ్ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈమెకు అక్క, చెల్లెలు వివాహాలై అత్తవారిళ్లలో ఉంటున్నారు. మౌనిక ప్రస్తుతం మేనమామ త్రిమూర్తులు సంరక్షణలో ఉంటున్నది. అయితే మౌనిక రెండేళ్లుగా కురుసాంపేటకు చెందిన నిమ్మకాయల చిన్నాను ప్రేమిస్తున్నది. ఇద్దరు కొంతకాలంగా ఒకరంటే ఒకరికి అమితంగా ఇష్టం ప్రేమించుకున్నారు.
అయితే చిన్నా కొన్నినెలల క్రితం ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేశాడు. తన సోదరుడు రూ 500 అడిగితే ఇవ్వలేదని బెదిరించేందుకు ఇలా చేసుకున్నాడు. అయితే కాకినాడలోని దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పట్నుంచి మౌనిక కళాశాలకు వెళ్లడం మానేసింది. చిన్నాకు సంబంధించిన దుస్తులు, సామగ్రి గదిలో పెట్టుకొని కొంతకాలం మనోవేదనతో ఉంటున్నది. అయితే సోమవారం తన ఇంట్లోనే ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మేనమామ త్రిమూర్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, యువతి మృతదేహానికి దవాఖానలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.