![Anna Canteens](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/Anna-canteen_.webp)
Anna Canteens : ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ అధికారంలోకి రావడంతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మూత పడిన అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతోంది ప్రస్తుత ప్రభుత్వం. ఏపీలో ఐదేళ్ల విరామం తర్వాత తిరిగి అన్న క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత నామమాత్రపు ధరతో నిరుపేదల కడుపు నింపేందుకు రెడీ అయ్యాయి. రీసెంట్ గా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తన నాలుగో సంతకాన్ని అన్న క్యాంటీన్ల పునరుద్దరణపైన చేశారు. దీంతో రాష్ట్రంలో తిరిగి ఈ క్యాంటీన్ల ప్రారంభానికి మార్గం సుగమమైంది. త్వరలో అధికారికంగా దీనిపై ఉత్తర్వులు కూడా రాబోతున్నాయి. అయితే గతంలో ఐదు రూపాయలకే భోజనం, టిఫిన్ అందించిన అన్న క్యాంటీన్లలో ఐదు సంవత్సరాల విరామం తర్వాత కూడా అవే ధరలు ఉండబోతున్నాయా లేక పెరగబోతున్నాయా అన్న చర్చ జరుగుతోంది.
ఎందుకంటే ఈ ఐదేళ్ల కాలంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. బియ్యం, పప్పుదినుసుల రేట్లు ఆకాశాన్నంటాయి. ఇలాంటి సమయంలో అన్న క్యాంటీన్లలో ధరలపై జరుగుతున్న ప్రచారాలకు తెరదించుతూ సీఎం చంద్రబాబు స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు. సీఎంగా నాలుగో ఫైలుపై అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ సంతకం చేసిన చంద్రబాబు..ఈసారి అన్న క్యాంటీన్లలో ఆహార ధరలను కూడా ప్రకటించారు. గతంలో లాగే ఈసారి కూడా టిఫిన్ ఐదు రూపాయలు, రెండు పూటలా భోజనం కూడా ఐదు రూపాయల చొప్పునే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో పేదలకు ద్రవ్యోల్బణంతో సంబంధం లేకుండా పాత రేట్లకే ప్రతిరోజు భోజనం, టిఫిన్ దొరుకుతాయి. అంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం అన్నీ కలిపినా రోజుకు కేవలం 15 రూపాయలు మాత్రమే అవుతుంది. దీంతో 15 రూపాయలకే రోజంతా పేదలు కడుపు నిండా తినొచ్చు. ఈ మేరకు సర్కార్ సిద్దం కావడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.