![Bangladesh MP Murder](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/P-8-15.jpg)
Bangladesh MP Murder : బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజిమ్ అనార్ (56) కోల్ కతాలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరిన్ని దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ మహిళతో ఆయనను వలపు వలలోకి లాగి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో బంగ్లాదేశ్ నుంచి కోల్ కతాకు అక్రమంగా వచ్చిన జిహాద్ హవ్లాదార్ ను పోలీసులు అరెస్టు చేయడంతో ఈ దారుణాలు బయటకు వస్తున్నాయి. ఎంపీ హత్య అనంతరం మృతదేహాన్ని అదృశ్యం చేసేందుకు నిందితులు చర్మాన్ని ఒలిచి, ముక్కలుగా నరికినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ కేసులో సీసీ టీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. అమెరికాలో నివసించే ఓ మిత్రుడు అద్దెకు తీసుకున్న టౌన్ హాల్ ప్రాంతంలోని అపార్ట్ మెంట్ లోకి ఇద్దరు పురుషులు, ఒక మహిళతో కలిసి వెళ్లిన ఆయన ఆ తర్వాత తిరిగి రాలేదని గుర్తించారు. బంగ్లాదేశ్ ఎంపీని మహిళతో హనీట్రాప్ చేయించి ఆ అపార్ట్ మెంట్ లోకి రప్పించి ఉంటారని, మృతుడి స్నేహితుడికి ఆ మహిళ సన్నిహితురాలే అయి ఉంటుందని ప్రాథమికంగా తెలుస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ సీఐడీ అధికారి ఒకరు తెలిపారు. ఫ్లాట్ లోకి వెళ్లగానే ఆయనను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నట్లు వెల్లడించారు.
బంగ్లా ఎంపీ మహమ్మద్ అనర్ మే 12న కోల్ కతా శివారులో ఉన్న తన స్నేహితుడి ఇంట్లో బస చేశారు. ఆ మరుసటి రోజు పని ఉందని బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. ఎంపీ కోసం పోలీసులు విస్తృతంగా గాలించగా, వారం రోజుల తర్వాత హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇంతవరకు ఆయన మృతదేహం మాత్రం లభించలేదు.