Bangladesh MP : బంగ్లాదేశ్ ఎంపీ ఒకరు కోల్ కతాలో హత్యకు గురయ్యారు. కోల్ కతాలోని న్యూటౌన్ లో బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్ కు చెందిన ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ ను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం (మే 22) హత్య చేశారు. ఆయన మే 12న మెడికల్ చెకప్ కోసం కోల్ కతాకు వచ్చినట్లు సమాచారం. అజీమ్ బంగ్లాదేశ్ లోని జెనైదా 4 నియోజకవర్గం నుంచి అవామీ లీగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు.
అజీమ్ వైద్య చికిత్స నిమిత్తం పశ్చిమబెంగాల్ కు వచ్చారు. మే 12న బారానగర్ లోని తన స్నేహితుడు గోపాల్ బిశ్వాస్ ఇంట్లో ఉన్నారు. రెండు రోజుల తర్వాత వెంటనే వస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో స్నేహితుడితో పాటి బంగ్లాదేశ్ లోని ఎంపీ కుటుంబ సభ్యులు ఆయనకు ఫోన్లు చేసినా సమాధానం రాలేదు. మే 14 నుంచి ఎంపీ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. వెంటనే గోపాల్ బిశ్వాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న అజీమ్ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని బంగ్లా ప్రధాని షేక్ హసీనా దృష్టికి తీసుకు వెళ్లారు. భారత్ లోని దౌత్యవేత్తలకు సమాచారం ఇచ్చారు. ఆనాటి నుంచి పశ్చిమ బెంగాల్ పోలీసులు, బంగ్లాదేశ్ అధికారులు ఆయన కోసం గాలిస్తున్నారు. ఈరోజు ఆయన మృత దేహం లభించింది.
ఎంపీ అన్వరుల్ అజీమ్ హత్యను బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ ధ్రువీకరించారు. అధికార పార్టీ ఎంపీ అజీమ్ ను కోల్ కతాలో హత్య చేశారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారని, హంతకులు బంగ్లా దేశీయులేనని ఖాన్ చెప్పారు. కాగా, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.