Barrelakka Sirisha : తన పోస్టులతో గత ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టిన కర్నె శిరీష అలియస్ బర్రెలక్క గురించి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేదు. ‘ప్రభుత్వం (బీఆర్ఎస్) నోటిఫికేషన్లు వేయడం లేదు.. నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో బర్రెలను కాపు కోవడమే గొప్ప పని.. పొట్ట కూటి కోసం ఏదైనా చేయాల్సిందే’ ఇలా వీడియోల మీద వీడియోలు పెట్టి చాలా ఫేమస్ అయ్యారు శిరీష (బర్రెలక్క).
బర్రెలక్క వీడియోస్ పై గత ప్రభుత్వం బాగానే ఫైరైంది. ప్రభుత్వానికి ఆపోజిట్ గా వీడియోలు ఏంటి.. తొలగించాల్సిందే అంటూ ముప్పుతిప్పలు పెట్టింది. అయినా ఆమె వాటిని తొలగించలేదు. దాదాపు ఐదేళ్ల పాటు ప్రభుత్వంపై ఒంటరి పోరాటం చేసింది బర్రెలక్క. ఆమెకు చాలా మంది నెటిజన్లు తోడవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకు వచ్చాయి. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పోరాటం కాదు.. నేరుగా తలపడాలని అనుకుని నామినేషన్ వేసింది. ఇంకే ముంది మూడు ప్రధాన పార్టీలు కలవరపడ్డాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో 118 నియోజకవర్గాల అభ్యర్థుల కంటే ఆమె ప్రచారం సోషల్ మీడియాలో మారుమోగింది. మాజీ డీజీ లక్ష్మీనారాయణ లాంటి వారు స్వయంగా తరలివచ్చి మారీ బర్రెలక్కకు మద్దతిచ్చారు. ఇంకా ఆమెకు లక్షలాది మంది విరాళాలు పంపారు. ఇంత చేసినా ఆమె ఓటమి పాలవడం చాలా మందిని కలవరపెట్టింది. సాక్షాత్తు పక్క రాష్ట్ర సీఎం జగన్ కూడా బర్రెలక్కను పవన్ కళ్యాణ్ ను పోల్చుతూ వ్యాఖ్యానించారంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె క్రేజ్ ఎంత పెరిగిందో ఇట్టే తెలుస్తుంది.
ఇవన్నీ పక్కన ఉంచితే.. బర్రెలక్క తన ఇన్ స్టా ఖాతాలో ఏడుస్తూ ఒక పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. తనను అపార్థం చేసుకుంటున్నారని పోస్ట్ లో పేర్కొన్నారు. ‘నన్ను ఎందుకు అపార్థం చేసుకుంటున్నారో తెలియడం లేదు.. గుడ్ మార్నింగ్’ అంటూ వీడియో పెట్టారు. ఏమైందో తెలియని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే కన్నీటికి గల పూర్తి కారణాలను బర్రెలక్క వెల్లడించలేదు.