New Headache For BCCI : ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ 2023 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు సగం మ్యాచ్ లు 25 వరకు విజయవంతంగా ముగిశాయి. ఈ రోజు (అక్టోబర్ 27) మధ్యాహ్నం 2 గంటల నుంచి ఐసీసీ మెన్స్ వరల్డ్ 26వ మ్యాచ్ దక్షిణాఫ్రికా-పాకిస్తాన్ కొనసాగుతుంది. ఈ మ్యాచ్ చెన్నై చెపాక్ లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది.
ఇప్పటికే వరుస విజయాలతో దూసుకెళ్తున్న సౌతాఫ్రియాను పాకిస్తాన్ నిలువరిస్తుందా? అన్న సందేహాలు నెలకొన్నాయి. దక్షిణాఫ్రికా ఐదు మ్యాచ్ లు ఆడగా నాలుగింటిలో విజయం సాధించి రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇక పాక్ ఆడిన ఐదు మ్యాచ్ లలో రెండు మాత్రమే గెలిచింది. దీంతో ఆరో స్థానంలోకి పడిపోయింది. ఇక పాక్ తన తదుపరి బంగ్లాదేశ్ జట్టును అక్టోబర్ 31వ తేదీ ఈడెన్ గార్డెన్ లో తలపడుతుంది.
ఇప్పటి వరకు తొలి దశ మ్యాచ్ లు దేశంలోని వివిధ స్టేడియంలలో జరగగా.. మలి దశ మ్యాచ్ లలో ఎక్కువ మ్యాచ్ లు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ లో జరగనున్నాయి. ఇందులో భాగంగా శనివారం (అక్టోబర్ 28) బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్ ఆ తర్వాత మంగళవారం (అక్టోబర్ 31) పాక్ వర్సెస్ బంగ్లాదేవ్, నవంబర్ 5వ తేదీ భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా, 11వ తేదీ ఇంగ్లాండ్ వర్సెస్ పాక్ ఈమ్యాచ్ లు అన్నీ ఈడెన్ గార్డెన్ లో జరగనున్నాయి. వీటితో పాటు నవంబర్ 16న జరిగే సమీ ఫైనల్ కూడా ఈడెన్ గార్డెన్ లోనే జరగనుంది.
ఈ నేపథ్యంలో బీసీసీఐకి ఒక తలనొప్పి మొదలైంది. ఈడెన్ గార్డెన్ మైదానం 1864లో నిర్మించింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలలో ఇదే మూడోది. ఇక కెపాసిటీ చూస్తే 66,000 మంది వరకు పడతారు. అందుకే దీన్ని క్రికెట్ మక్కాగా కూడా పిలుస్తారు. బీసీసీఐ-బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కలిసి దీని నిర్వహణ బాధ్యతలు చూస్తారు.
ఈ స్టేడియం బయట అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు కొనసాగుతున్న క్రమంలో ఒక గోడ కూలిపోయింది. నిర్మాణ పనుల్లో భాగంగా ఒక యంత్రం ఢీ కొట్టడంతో గోడ ధ్వంసమైంది. 3-4 గేట్ల మధ్య ఈ గోడ ఉంది. దీనికి తోడు లైటింగ్ టవర్ కూడా సమీపంలో ఉండడంతో బీసీసీఐ తలపట్టుకుంటుంది. ఇప్పటికైతే ఎటువంటి ఇబ్బంది లేదని, లైటింగ్ టవర్ కు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తోంది. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతుంది. ఇక శనివారం (అక్టోబర్ 28)వ తేదీ జరిగే బంగ్లా-నెదర్లాండ్ మ్యాచ్ కు ఎటువంటి ఇబ్బంది ఉండదని పేర్కొంది.