BCCI Paid Tribute : టీమిండియా నిన్న (అక్టోబర్ 29) జరిగిన భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్ లో నల్ల రిబ్బన్లు (బ్లాక్ ఆర్మ్ బ్యాండ్స్) కట్టుకొని బరిలోకి దిగింది. ఇదేంటని సందేహం వ్యక్తం చేసిన అభిమానులు ఆరా తీయడం ప్రారంభించారు. అది మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ గౌరవార్థం పెట్టుకున్నట్లు బీసీసీఐ తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా తెలిపింది.
పంజాబ్ లోని అమృత్ సర్ నగరంలో 1946లో జన్మించారు బిషన్ సింగ్ బేడీ. స్పిన్నర్ గా భారత జట్టులో చేరిన ఆయన 266 వికెట్లు తీసుకున్నాడు. ఒకే మ్యాచ్ లో ఐదు వికెట్లు చొప్పున 14 మ్యాచ్ లో ఈ రికార్డు సాధించాడు. ఒక మ్యాచ్ లో 10కి 10 వికెట్లు బిషన్ సింగ్ బేడీనే తీసుకున్నాడు. 1966 నుంచి 1978 మధ్య టీమిండియాలో కీలక ఆటగాడిగా కొనసాగారు బేడీ. 1990లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ దేశాల్లో పర్యటించిన భారత జట్టుకు మేనేజర్ గా కూడా ఆయన కొనసాగారు.
మణిందర్ సింగ్, మురళీ కార్తీక్, సునీల్ జోషీ లాంటి దిగ్గజ స్పిన్నర్లను తీర్చి దిద్దింది బిషన్ సింగ్ బేడీనే. జాతీయ జట్టుకు సెలక్టర్ గా కూడా వ్యవహరించారు ఆయన. ఇక, మన్సూర్ అలీఖాన్ పటౌడీ రిటైర్మెంట్ తర్వాత నాలుగేళ్ల పాటు (1975-1979) వరకు ఆయన భారత క్రికెట్ టీంకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఎన్నో మ్యాచ్ లను ఒంటి చేతిపై గెలిపించిన రికార్డ్ ఆయన పేరుపై ఉంది.
బేడీకి రెండో భార్య అంజు, కుమార్తె నేహా, కుమారుడు అంగద్, గవాస్ ఇందర్ సింగ్ మరియు కుమార్తె గిల్లిందర్ అతని మొదటి భార్య గ్లెనిత్ మైల్స్ ఉన్నారు. బేడీ గత రెండేళ్ల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న కన్ను మూశారు.