Big Sketch of Congress : గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ భారీగా వ్యూహాలు పన్నుతోంది. ఎక్కడి నుంచి ఏ నేతను నిలబడితే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయోనని బేరీజు వేసుకుంటుంది. ఇప్పటికే సునీల్ కనుగోలు టీంకు చెందిన స్ట్రాటజిస్టులు కాంగ్రెస్ మాజీ నాయకులను, బీఆర్ఎస్, బీజేపీలోకి వెళ్లిన వారిని తమ పార్టీలోకి తీసుకువచ్చేందుకు వారిని కలిసి మాట్లాడుతున్నారు. దాదాపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిక ఖరారుగా కనిపిస్తుంది. నేడో, రేపో గడ్డం వివేక్ కూడా వెళ్తున్నట్లు లీకులు వినిపిస్తున్నాయి. వీరు కూడా వెళ్లిన తర్వాత పూర్తి స్థాయి అభ్యర్థుల లిస్ట్ ను బయటకు విడుదల చేయనున్నారు.
షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచి బీఆర్ఎస్, బీజేపీలోని అసంతృప్త నేతలను లాక్కునేందుకు భారీ ప్రణాళిక రచించింది సునీల్ టీమ్. కొందరిని ఇప్పటికే ఢిల్లీకి పిలిచి మాట్లాడగా.. మరికొందరి ఇంటికి వెళ్లి మాట్లాడుతున్నారు. వీరిలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయ శాంతి, విక్రమ్ గౌడ్ బీజేపీకి చెందిన వారు కాగా తీగల కృష్ణారెడ్డి కూడా ఉన్నారు. ఇక తీన్మార్ మల్లన్నను పార్టీలో చేర్చుకుంటే అదనపు ప్రయోజనం చేకూరుతుందని పార్టీ ఆలోచిస్తుంది. వీరందరి చేరిక తర్వాత సెకండ్ లిస్ట్ లో పూర్తి స్థాయి అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తామని చెప్పారు.
ఇక, బీజేపీ భారీ ప్లాన్ చేసినట్లుగానే కాంగ్రెస్ కూడా భారీ ప్లాన్ దిశగా పావులు కదుపుతుంది. ముఖ్యంగా గజ్వేల్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేటలో బలమైన అభ్యర్థులను నియమించేందుకు పావులు కదుపుతుంది. ఇందులో భాగంగా గజ్వేల్ లో తీన్మార్ మల్లన్నను నిలిపితే బాగుంటుందని అనుకున్న పార్టీ అక్కడ ఈటల రాజేందర్ ఉన్నందువల్ల ఆ స్థాయిలో వ్యక్తిని నిలబెట్టాలని యోచిస్తోంది. ఇక పద్మశాలి ఓట్లు ఎక్కువగా ఉన్న సిరిసిల్ల సిగ్మెంట్ లో కొండ సురేఖను నిలబెట్టాలనుకుంటుంది. ఇక రేవంత్ రెడ్డి కేసీఆర్ పై కామారెడ్డిలో నిలబడుతున్నారని, కొడంగల్ తో పాటు అక్కడా నిలబడతారని పార్టీ నుంచి లీకులు వినిపిస్తున్నాయి.