BJP and Janasena Alliance : బీజేపీ, జనసేనల పొత్తు ఏ పార్టీకి లాభమనే విషయమై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతున్నది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఢీకొట్టేందుకు ఈ రెండు పార్టీలు కలిశాయనేది టాక్. అయితే ఇప్పుడు ఈ పొత్తు ఎవరి టికెట్లకు గండి కొడుతుందనే విషయమై చర్చ సాగుతున్నది.
నిజానికి రాష్ర్టంలో అధ్యక్షుడి మార్పు తర్వాత బీజేపీ కొంత వీక్ గా మారిందని శ్రేణులు భావిస్తున్నాయి. దీంతో బలమైన బీఆర్ఎస్, వేగంగా పుంజుకుంటున్న కాంగ్రెస్ ను ఢీ కొట్టేందుకు జనసేనతో పొత్తు అవసరమని బీజేపీ అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో అక్టోబర్ 18న కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పొత్తు విషయమై భేటీ అయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ కలిసిరావడంతో పాటు,యువ ఓటర్లే టార్గెట్ గా జనసేనతో బీజేపీ పొత్తుకు సై అంటోంది. కాగా 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి జనసేన పార్టీ మద్దతు ఇచ్చింది.
2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేసింది. వాస్తవానికి బీజేపీ చాలా చోట్ల సంస్థాగతంగా బలంగా ఉంది. అయితే రాష్ర్ట విభజన తర్వాత జనసేన ఏపీ రాజకీయాలకే పరిమితమైంది. జనసేనాని ఏపీ రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో తెలంగాణలో జనసేన పార్టీ నామమాత్రంగా తయారైంది. అయితే ఇప్పుడు పొత్తు కుదరడంతో సీట్ల అంశమై చర్చ జరుగుతున్నది. మేడ్చల్ జిల్లాలోని ఐదు సెగ్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలకు గను కుత్బుల్లాపూర్ అభ్యర్థిని ఇప్పటికే బీజేపీ ఫైనల్ చేసింది. కూన శ్రీశైలంగౌడ్ ను అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. కూకట్ పల్లి, మల్కాజిగిరి స్థానాలకు జనసేన పట్టుబట్టే అవకాశం ఉంది. మరి ఇక బీజేపీ కూడా పట్టుబడితే పరిస్థితి ఏంటనేది చర్చ జరగుతున్నది. బీజేపీ శ్రేణులు సహకరిస్తాయా లేదా అనేది ఇప్పుడు తేలడం లేదు. మరోవైపు జనసేన ఈ సీట్లపై పట్టుబడితే పొత్తు అంశానికి ఆదిలోనే గండం ఏర్పడే అవకాశం ఉంది.