BJP+JANASENA Alliance : తెలంగాణ ఎన్నికల సమరంలో ఈ రోజు (అక్టోబర్ 25) కీలక అడుగు పడనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తామని గతంలోనే ప్రకటించారు. 32 స్థానాల్లో జనసేన అభ్యర్థులను నిలబెడతానని చెప్పినా.. అభ్యర్థులు, పొత్తుల గురించి ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ పోటీ మాత్రం చేయడం ఖాయమని చెప్పారు. ఈ నేపథ్యంలోనే రెండు, మూడు రోజుల క్రితం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు గంగారపు కిషన్ రెడ్డిని కలిశారు. ఆ సమయంలో పొత్తుపై తీవ్ర దుమారం నెలకొంది. తెలంగాణలో బీజేపీతో కలిసి వెళ్లాలని టీడీపీ అనుకున్నా.. బీజేపీ మాత్రం దూరం పెడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఇప్పుడు తెరముందుకు వచ్చింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు ఢిల్లీ టూర్ చేపట్టారు. బీజేపీ అగ్రనాయకత్వంతో సమావేశం కానున్నారు. దీని కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్ కూడా ఈ చర్చల్లో పాల్గొననున్నారు. ఇక వీరి సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొన్ని స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
పార్టీ అధ్యక్షుడు 32 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించడంతో జన సైనికులు తదనుగుణంగా అన్నీ సిద్ధం చేస్తున్నారు. అయితే ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్న జనసేనను బీజేపీ కలుపుకొని పోతే హైదరాబాద్ లో ఉన్న సెటిలర్ల ఓట్లను ఏక పక్షంగా దక్కించుకోవచ్చని అనుకుంది. అందుకే జనసేనతో కలిసి వెళ్లాలని బీజేపీ భావిస్తుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. జనసేనతో కలిసి పని చేస్తే బీజేపీకి కొన్ని సీట్లు కలిసి వచ్చే అవకాశం లేకపోలేదని చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ పొత్తుతో తెలంగాణలో మరో కీలక అడుగు పడబోతుందనే చెప్పాలి.